ఇసుక దందా ఆపుతారా? బుకీలపై విచారణ దేనికి?: ఎస్పీపై నెల్లూరు ‘తమ్ముళ్ల’ ఆగ్రహం
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తమ పార్టీ కార్యకర్తలు చాలా క్రమశిక్షణ కలవారని, నిబద్ధతకు మారుపేరని ప్రకటిస్తుంటారు. కానీ అధికారం అండతో వారేం చేసినా చూసీ చూడనట్లు ఉండిపోవాలని అధికారులు.
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తమ పార్టీ కార్యకర్తలు చాలా క్రమశిక్షణ కలవారని, నిబద్ధతకు మారుపేరని ప్రకటిస్తుంటారు. కానీ అధికారం అండతో వారేం చేసినా చూసీ చూడనట్లు ఉండిపోవాలని అధికారులు.. ప్రత్యేకించి పోలీసు అధికారులకు రాష్ట్ర మంత్రి పీ నారాయణ ఆదేశాలు జారీ చేసినట్లు ఆరోపనలున్నాయి. ఆయన సొంత జిల్లా నెల్లూరులో జరుగుతున్న తతంగమిది.
డీఎస్పీలు, సీఐలు మాట వినడం లేదని మంత్రి నారాయణకు తెలుగు తమ్ముళ్లు ఫిర్యాదుచేసే వరకు వెళ్లింది. తమను ఇసుక నుంచి మద్యం వరకు కట్టడి చేస్తే ఎలాగని తెలుగు తమ్ముళ్లు ఆవేదన చెందుతున్నారు. వాడీగా వేడిగా జరిగిన నెల్లూరు జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ప్రజా సమస్యల ప్రస్తావనే లేదుగానీ.. నాయకులు, ముఖ్య కార్యకర్తలకు ఎదురవుతున్న సమస్యలపైనే ప్రధాన చర్య జరగడం గమనార్హం. ఇక మరో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి, ఆనం బ్రదర్స్ ఈ సమావేశానికి దూరంగా ఉండటం ఆసక్తికర పరిణామం.
సీఐలు, డీఎస్పీలు తమ మాట వినడం లేదని, ఇసుక ట్రాక్టర్లపై కేసులు నమోదు చేస్తున్నారని సమావేశానికి హాజరైన తెలుగు తమ్ముళ్లు వాపోయారు. క్రికెట్ బెట్టింగ్ రాకెట్ గుట్టు విప్పటం వల్ల ఇబ్బంది కలుగుతోందని, ఇసుక నుంచి మద్యం వరకు అన్ని అక్రమ వ్యవహారాలను కట్టడి చేస్తున్నారంటూ గళమెత్తారు. జిల్లాలో పోలీసులు ముక్కుసూటిగా పనిచేయడం వల్ల తెలుగు తమ్ముళ్ల ఆర్థిక మూలాలపై దెబ్బ పడుతోందని వాపోయారు. పార్టీ వ్యవహారాల కంటే ముందు ఈ విషయం తేల్చాలని మంత్రుల ఎదుట పంచాయితీ పెట్టారు. 'కనీసం సీఐ కూడా మాట వినకపోతే ఎమ్మెల్యేలుగా ఏం పని చేయాలో మీరే చెప్పండి' అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు సమస్యల చిట్టాను విప్పారు. గమ్మత్తేమిటంటే పార్టీ సమన్వయ కమిటీ సమావేశం తర్వాత జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితర అధికారులతో సమావేశమైన మంత్రులు.. బెట్టింగ్ రాకెట్ ను కట్టడి చేసినందుకు అభినందించినట్లు వార్తలొచ్చాయి.
ఇసుక రవాణాలో సామాన్యులపైనా కేసులా?
ముఖ్యంగా ఇసుక ఆక్రమ రవాణాను కట్టడి చేశారని.. ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు, ఇతర వాహనాలపై కేసులు నమోదు చేస్తున్నారని వివరించారు. ‘మనవాళ్లను చూసీచూడనట్టు వదలేయమని అడుగుతున్నా పోలీస్ అధికారులెవరూ మాట వినటం లేదు' అని ఫిర్యాదు చేశారు. గూడూరు ఎమ్మెల్యే సునిల్కుమార్ ఇసుక అక్రమ రవాణా అంశాన్ని లేవనెత్తారు. కొన్ని సందర్భాల్లో పేదలకు కూడా ఇసుక దొరకటం లేదని, వరుస కేసులు నమోదు చేస్తే అందరికీ కష్టమవుతుందని చెప్పారు. ఆత్మకూరు టీడీపీ ఇన్చార్జి కన్నబాబు మాట్లాడుతూ మద్యం షాపులపైనా పోలీసులు విరుచుకుపడుతున్నారని.. బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మితే వారితోపాటు లైసెన్స్దారులపైనా కేసులు నమోదు చేస్తామని చెప్పారని ఫిర్యాదు చేశారు. దీనివల్ల టీడీపీ నేతల ఆర్థిక మూలాలకు దెబ్బ తగులుతోందని వాపోయారు.
కనీసం ఎస్సై అయినా తమ వినకపోతే అధికార పార్టీ నేతలుగా ఏం చేయగలుగుతామని కొందరు ప్రశ్నించారు. ఇసుక అక్రమాలను నియంత్రించే క్రమంలో రైతులు, పేదలు ఇళ్లు కట్టుకోవటానికి ట్రాక్టర్లలో ఇసుక తీసుకెళ్లినా కేసులు నమోదు చేస్తున్నారని పలువురు నేతలు పేర్కొన్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలో చెక్డ్యాంల నిర్మాణానికి ఆరు ట్రాక్టర్లకు ఇసుక రవాణా అనుమతులు ఇస్తే.. వాటిని సంబంధిత స్టేషన్ ఎస్ఐ సీజ్ చేశారని పరసా రత్నం పేర్కొన్నారు. దీంతో ఒక్కొక్క ట్రాక్టర్కు రూ.లక్ష వరకు జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఇదే తీరులో పేదలు ఇళ్లు, మరుగుదొడ్ల నిర్మాణానికి ఇసుక తీసుకెళ్తున్నా కఠినంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు. దీనివల్ల ప్రభుత్వానికి ప్రజల్లో చెడ్డ పేరు వస్తుందని తెదేపా ముఖ్య నాయకుడు ఆదాల ప్రభాకరరెడ్డి ప్రస్తావించారు. ఈ విషయంలో ఎస్పీ వ్యవహరించే తీరువల్ల రైతులు, సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని.. ఇసుక మాఫియా పట్ల కఠినంగా వ్యవహరించినా.. ప్రజల విషయంలో చూసీచూడనట్లు ఉండాలని పేర్కొన్నారు.
Recommended Video
చూసీచూడనట్టు వెళ్లమనండి
టీడీపీ సమన్వయ సమావేశంలో నేతలు, ఎమ్మెల్యేలు జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణపై మూకుమ్మడి దాడి చేయడానికి పూనుకున్నారు. ఆయన తీరువల్ల పార్టీకి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని దాదాపు ముఖ్య నేతలు అంతా పేర్కొన్నారు. జిల్లా ఎస్పీగా రామకృష్ణ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధానంగా ఇసుక మాఫియా, మద్యం బెల్టు దుకాణాల నియంత్రణ, ఎర్ర చందనం అక్రమ రవాణా.. క్రికెట్ బెట్టింగ్ల వ్యవహారంపై దృష్టి సారించారు. నగరంలో వాహన రద్దీ కారణంగా సామన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించే అంశాన్ని ప్రధానంగా చేపట్టారు. ఇవన్నీ కొంత సామాన్య ప్రజలకు ఇబ్బందిగా మారాయని తెలుగు తమ్ముళ్లు వాదిస్తున్నారు. ఎలాగైనా ఎస్సీ దూకుడుకు కళ్లె వేయాలని కోరినట్లు తెలిసింది. పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా సమస్యలు ఏకరువు పెట్టారు. కొత్త ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ బాధ్యతలు చేపట్టాక ఇసుక, మద్యం అక్రమ అమ్మకాలను పూర్తిగా కట్టడి చేశారని, క్రికెట్ బెట్టింగ్ రాకెట్ను వారం క్రితం అదుపులో తీసుకుని విచారణ జరుపుతున్నారని సెలవిచ్చారు. క్రికెట్ బుకీల వ్యవహారంపై ఒకరిద్దరు నేతలు దీనిపై ప్రధానంగా మాట్లాడినట్లు తెలిసింది. బుకీలు, బెట్టింగ్ల వ్యవహారంతో సంబంధం ఉన్న వారిని అరెస్టు చేస్తే ఫర్వాలేదని, పోలీసు సిబ్బందిని ఇబ్బంది పెట్టకుండా ఎస్పీకి సూచించాలని కోరినట్లు తెలిసింది. ఎస్పీ వచ్చిన తర్వాత విధులను నిర్వహించే విషయంలో కిందిస్థాయి పోలీసు సిబ్బంది ఒత్తిడి ఎదుర్కొంటున్నారని, దీనివల్ల చిన్న సమస్య ఉన్నా పార్టీ తరఫున పరిష్కరించలేని పరిస్థితి ఉందని చెప్పినట్లు తెలిసింది.
ఎస్పీ, కలెక్టర్లతో మంత్రులు ఇలా
మద్యం బెల్టు దుకాణాలపై చర్యలు తీసుకోవడంలోనూ ఎస్పీ, పోలీసు సిబ్బంది దూకుడుగా వ్యవహరిస్తున్నట్లు పలువురు నేతలు ఫిర్యాదు చేశారు. ఎక్కడైనా మద్యం సీసాలు దొరికితే.. సంబంధిత వ్యక్తి ఏ మద్యం దుకాణం నుంచి వాటిని తీసుకువచ్చారు అనే సమాచారాన్ని పోలీసులు సేకరించి మద్యం దుకాణం లైసెన్సు ఎవరి పేరిట ఉందో వారిపై కేసులు నమోదు చేస్తున్నారన్నారు. దీనివల్ల కొందరు సెంటిమెంట్ ఆధారంగా ఇంట్లో కుటుంబ సభ్యుల పేరిట మద్యం లైసెన్సు తీసుకుంటే పోలీసులు వారిపైనే చర్యలు తీసుకుంటున్నారు. ఇది ఇబ్బందిగా మారిందని, అలా కాకుండా మద్యం దుకాణాన్ని నిర్వహిస్తున్న వారిపై చర్య తీసుకోవాలని ఎస్పీకి సూచించాలని పలువురు నేతలు కోరారు. నెల్లూరు జిల్లాలో వివిధ అంశాలపై కలెక్టర్ ముత్యాలరాజు, జేసీ ఎఎండి ఇంతియాజ్ను కూడా మంత్రి క్యాంపు కార్యాలయానికి పిలిపించారు. ఈ సమయంలోనే జిల్లా ఎస్పీ రామకృష్ణతో ఇద్దరు మంత్రులు, మరో ముఖ్య నేత ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇదే తీరులో వెళ్తే పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందులు ఉంటాయని మంత్రి నారాయణ ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇసుక అక్రమ రవాణను నియంత్రించే క్రమంలో అనుమతిలేని చోట నుంచి ఇసుక రవాణా చేస్తే చర్యలు తీసుకోవాల్సిందేనని ఎస్పీ చెప్పినట్లు సమాచారం. అన్ని విషయాల్లో కాకున్నా.. కొన్ని విషయాల్లో మార్పులు చేస్తామని.. మద్యం బెల్టు దుకాణాలు, క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో మాత్రం విచారణలో లభించిన సమాచారం మేరకు వ్యవహరిస్తామని ఎస్పీ చెప్పినట్లు తెలిసింది. ఎస్పీ వ్యవహార శైలి గురించి నెల్లూరు జిల్లా తెలుగు తమ్ముళ్లు కొంత గుర్రుగా ఉన్నారు.
ఆనం రామనారాయణ రెడ్డితో విభేదాలిలా
సమన్వయ కమిటీ సమావేశం జరుగుతున్న సమయంలోనే ఇంతకుముందు ఆత్మకూరు నియోజకవర్గం ఇన్ చార్జిగా వ్యవహరించిన కన్నబాబుతో సుమారు గంట సేపు ఇద్దరు మంత్రులు, ముఖ్య నేత ఆదాలప్రభాకరరెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రస్తుత ఇన్ఛార్జి ఆనం రామనారాయణరెడ్డి తీరుపై కన్నబాబు మంత్రుల ఎదుట అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాజకీయంగా ఇతర అవకాశాలు ఉన్నా కేవలం పార్టీ, ఇక్కడి నేతలతో ఉన్న సంబంధాల వల్ల ఆ ఆలోచన చేయటం లేదని కన్నబాబు మంత్రుల ఎదుట ఆవేదన వ్యక్తం చేసినట్ల తెలిసింది. దీంతో మంత్రి నారాయణ మాట్లాడుతూ ఒకే నియోజకవర్గంలో రెండో నాయకత్వాన్ని ప్రోత్సహించే పరిస్థితి లేదని చెప్పినట్లు తెలిసింది. ప్రత్యామ్నాయం ఏంటని కన్నబాబు అడగటంతో సమన్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్దామని పేర్కొన్నారు. సీఎంను కలిసే విధంగా తాను స్వయంగా ఏర్పాట్లు చేస్తానని మంత్రి నారాయణ హామీ ఇచ్చినట్లు తెలిసింది. సుమారు గంట సేపు నేతల మధ్య చర్చ జరిగినా కన్నబాబు మాత్రం సంతృప్తి చెందే విధంగా ఎలాంటి హామీని మంత్రి ఇవ్వలేదు.