తొలుగుతున్న ముసుగు: కేజ్రీ ముందు ఉన్న సవాల్
మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) భవితవ్యం క్రమంగా ప్రశ్నార్థకంగా మారుతోంది. పంజాబ్, గోవా అసెంబ్లీ ఎన్న్నికల్లో ఓటమి మాదిరిగానే
న్యూఢిల్లీ: మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) భవితవ్యం క్రమంగా ప్రశ్నార్థకంగా మారుతోంది. పంజాబ్, గోవా అసెంబ్లీ ఎన్న్నికల్లో ఓటమి మాదిరిగానే ఎంసీడీ ఎన్నికల్లోనూ ఈవీఎంల్లో మాయ వల్లే ఓడిపోయామని ఆమ్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వాదించడం సంగతి అలా ఉంచితే కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే ఎంసీడీ ఎన్నికల్లో ఎక్కువగా నష్టపోయిందీ ఆప్ మాత్రమేనని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు లభించిన ఓట్ల శాతం తెలియ జేస్తున్నది.
అరవింద్ కేజ్రీవాల్ ప్రతిష్ట, చరిస్మా కొడిగట్టిపోతున్నదని, ఆయన సారథ్యంలో పార్టీ మనుగడ కొడిగట్టిపోతున్నదని ఆప్ ఎమ్మెల్యేలు కూడా గుర్తిస్తున్నారు. ఎమ్మెల్యేలు, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)లో జరిపిన చర్చలతో ఇప్పటివరకు ఆప్లో తిరుగులేని అధినేతగా అరవింద్ కేజ్రీవాల్ చరిస్మా వేగంగా తగ్గుముఖం పడుతున్నదని తెలుస్తున్నది.
కుమార్ విశ్వాస్తో కేజ్రీ రాజీ ఇలా
ఇదే క్రమంలో ఆప్ భవితవ్యాన్ని పరిరక్షించే నాయకుడిగా అందరికీ హింది కవి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కుమార్ విశ్వాస్ ఆశాదీపంగా కనిపిస్తున్నారు. కుమార్ విశ్వాస్కు కపిల్ మిశ్రా, ఇమ్రాన్ హుస్సేన్, రాజేశ్ రిషి, వందనాకుమారి, బావనాగౌర్ తదితరుల మద్దతు లభిస్తున్నది. ఈవీఎంల్లో లోపాల వల్లే ఓటమి పాలయ్యామన్న వాదనను తోసిపుచ్చిన కుమార్ విశ్వాస్.. తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. త్వరలో ఆప్కు కొత్త నాయకుడు వస్తారని విశ్వాస్ హెచ్చరించడంతో కేజ్రీవాల్ దెబ్బ తిరిగింది. ఆఘమేఘాల మీద డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో కలిసి కుమార్ విశ్వాస్ నివాసానికి చేరుకుని రాజీ కుదుర్చుకున్నారు.
షీలా దీక్షిత్ నుంచి గడ్కరీ వరకు పలువురిపై కేజ్రీ ఆరోపణలు ఇలా
కానీ కపిల్ మిశ్రాది మరో కేసు. కుమార్ విశ్వాస్ మాదిరిగా కాకుండా కపిల్ మిశ్రాది భిన్నమైన పరిస్థితి. కుమార్ విశ్వాస్ ప్రజాకర్షణ గల నేత. కానీ కపిల్ మిశ్రా అలా ప్రజాకర్షణ గల నేత కాదు. కానీ అరవింద్ కేజ్రీవాల్కు సత్యేంద్ర జైన్ రూ.2 కోట్ల ముడుపులు అందజేశారని కపిల్ మిశ్రా చేసిన ఆరోపణ వైరల్గా మారడంతోపాటు ఇతరులెవ్వరికి అనుమానం రాలేదంటే అతిశేయోక్తి కాదు. లోక్పాల్ ఉద్యమ వెలుగులో అరవింద్ కేజ్రీవాల్ ‘ఆమ్ఆద్మీ పార్టీ' స్థాపించారు. పార్టీ స్థాపించిన వెంటనే గాంధీ కుటుంబం నుంచి జైట్లీ వరకు.. షీలా దీక్షిత్ నుంచి నితిన్ గడ్కరీలపై అవినీతి ఆరోపణలు చేసి... అందుకు ప్రతిగా పరువు నష్టం దావా కేసులను ఎదుర్కొంటున్నారు. కానీ కేజ్రీవాల్కు సత్యేంద్ర జైన్ భారీగా ముడుపులు చెల్లించారని ఆరోపణలు నమ్మడం కొంత కష్టమే మరి. ఎన్నికల రాజకీయాల్లో ఇటువంటి ఆరోపణలు పూర్తిగా అబద్దమేనని సమాధాన పర్చుకోవచ్చు.
రూ.2 కోట్లకు లెక్కలు చూపాలని ఐటీ నోటీసులు
ఢిల్లీ ఏసీబీ చీఫ్కు అరవింద్ కేజ్రీవాల్ అవినీతి కార్యకలాపాలపై ఆధారాల చిట్టా అందజేసిన కపిల్ మిశ్రాపై ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ ఎదురు దాడికి దిగడం గమనించదగ్గ పరిణామమని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. పార్టీకి రకరకాల వ్యక్తుల నుంచి విరాళాలు అందాయని చెప్తున్న ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) నాయకత్వం తాజాగా సత్యేంద్ర జైన్ నుంచి తీసుకున్న రూ.2 కోట్లకు లెక్కలు చూపాలని ఆదాయం పన్నుశాఖ (ఐటీ) అధికారులు ఆదేశించడంతో కేజ్రీవాల్కు మరో తలనొప్పి ఎదురైందని చెప్పవచ్చు. మరో గమ్మత్తేమిటంటే అరవింద్ కేజ్రీవాల్ అవినీతికి పాల్పడిన సంగతి నిజమైతే ఆయన రాజీనామా కోసం ఆందోళన బాట పడతానని సామాజిక కార్యకర్త అన్నాహజారే హెచ్చరించడం ఆసక్తికర పరిణామం.
ఆప్ లో పెరుగుతున్న అసమ్మతి
కానీ ప్రస్తుత 66 మంది ఎమ్మెల్యేల్లో 60 మంది కేజ్రీవాల్ మద్దతు ఉంటే తప్ప మళ్లీ ఆయన మద్దతు ఉంటేనే డిపాజిట్లు గల్లంతవుతాయని చెప్తున్నారు. పంజాబ్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడానికి అరవింద్ కేజ్రీవాల్ పేరు మాత్రమే సరిపోదని ఫలితాల తీరు చెప్తున్నది. కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ నాయకత్వం ఒత్తిడికి గురవుతున్నది. పార్టీలోని నేతల్లో క్రమంగా అసమ్మతి పెరుగుతున్నది. ఇది మిగతా పార్టీలకు భిన్నం కాదని తాజాగా కపిల్ మిశ్రా వంటి వారి ఆరోపణలతో తేలిపోయింది. పార్టీ క్రమంగా దెబ్బ తింటుందన్నది.
నిజమైన స్నేహితుల్ని గుర్తించాల్సిందీ కేజ్రీయే
ఆప్ నాయకత్వంపై ఇప్పటివరకు ఉన్న ముసుగులు తొలగిపోయాయని తెలుస్తున్నది. ఈ తరుణంలో ఆప్ కన్వీనర్గా అరవింద్ కేజ్రీవాల్ తనకు నిజమైన స్నేహితులు ఎవ్వరో తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ ఎపిసోడ్లో సీఎం కేజ్రీవాల్కు మద్దతు పలికిన కుమార్విశ్వాస్.. ఈ పొరపాటు జరుగడానికి గల కారణాలను వివరించాల్సిన బాధ్యత సత్యేంద్ర జైన్దేనని వ్యాఖ్యానించడం కొసమెరుపు. 12 ఏళ్లుగా అరవింద్ కేజ్రీవాల్ తనకు తెలుసునని, ముడుపులు తీసుకున్నారంటే తాను నమ్మబోనని కుమార్ విశ్వాస్ వ్యాఖ్యానించడం గమనార్హం.