బాబుపై పోరు: పవన్, జగన్లతో ఉండవల్లి ఫార్ములా
విజయవాడ: మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్కు ఏ విషయంలోనైనా కుండబద్దలు కొట్టడం అలవాటు. నసుగుడు ఉండదు. రాష్ట్ర విభజనపై ఆయన గుర్రుగా ఉన్నారు. బిజెపిపై ఎంతగా గుర్రుగా ఉన్నారో, గతంలో తాను పనిచేసిన కాంగ్రెసు పార్టీపైనా అంతే గుర్రుగా ఉన్నారు. ఈ రెండు పార్టీలు కలిసి రాష్ట్రాన్ని విభజించాయనేది ఆయన అభియోగం.
రాష్ట్ర విభజనపై ఆయన రాసి ఇటీవల విడుదల చేసిన పుస్తకం కూడా వివాదంగా మారింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లు అసలు లోకసభలో ఆమోదమే పొందలేదని ఆయన అందులో వాదించారు. దీనిపై జైపాల్ రెడ్డి స్పందిస్తే ఆయనపై ఉండవల్లి విరుచుకుపడ్డారు.
ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్ర ప్రభుత్వం చెప్పడంపై ఆయన విరుచుకుపడుతున్నారు. బిజెపిపైనా, తెలుగుదేశంపైనా ఆయన నిప్పులు చెరుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు.
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓడించాలనేది ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు వల్ల తీవ్రమైన నష్టం జరుగుతుందని కూడా ఆయన అభిప్రాయపడుతున్నట్లు చెబుతున్నారు. దీనికోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాయకులకు ఓ ప్రతిపాదన చేసినట్లు కనిపిస్తున్నారు.
జగన్ పోరాటంపై ఉండవల్లి కామెంట్ ఇదీ..
రత్యేక హోదా కోసం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. రెండేళ్లయినా పోరాడతానని జగన్ చెప్పినా ఏమీ కాదని, ప్రజాస్వామ్యంలో మెజారిటీ అభిప్రాయానిదే విజయమని ఆయన అన్నారు.
ఉండవల్లి ప్రతిపాదన ఇదీ...
జగన్ రెండేళ్లు పోరాడినా ఎపికి ప్రత్యేక హోదా రాదు కాబట్టి అలా పోరాటం చేయడం వృధా అనేది ఉండవల్లి మాటల్లో వ్యక్తమైందని చెప్పవచ్చు. అయితే, ఏం చేయాలనేది ప్రశ్న. ప్రశ్నకు కూడా ఆయన సమాధానం చెప్పారు. ప్రత్యేకహోదా కోరే జగన్, పవన్, కాంగ్రెస్, కమ్యూనిస్టులంతా ఏకమై రాబోయే మున్సిపల్ ఎన్నికలలో బీజేపీ, టీడీపీపై పోటీ చేస్తేనే మంచి జరుగుతుందని వ్యాఖ్యానించారు.
పవన్ కల్యాణ్ కలుస్తారా...
చంద్రబాబుపై పోరాటం చేయడానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగన్తో కలుస్తారా అనేది సందేహమే. జగన్పై ఆయనకు తీవ్రమైన అభ్యంతరాలున్నట్లు ఎన్నికల సమయంలో చేసిన ప్రసంగాలను పరిశీలిస్తే అర్థం చేసుకోవచ్చు. తాను ఒక్కడినే పోరాటం చేయగలననే ధీమా కూడా ఆయనకు ఉన్నట్లుంది. అదే సమయంలో ఆయన చంద్రబాబు పట్ల మెతగ్గా ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి.
సీతయ్య ఎవరి మాటా వినరు...
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తనకు నచ్చిందే చేస్తారు తప్ప ఇతరులు చెప్పే మాటలను వినరనే అభిప్రాయం బలంగా ఉంది. పవన్ కల్యాణ్తో ఆయన పనిచేయడానికి ముందుకు రాకపోవచ్చు. ఒకవేళ 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పోటీ చేస్తే ఇరువురు కూడా ముఖ్యమంత్రి పీఠాన్నే ఆశిస్తారు. కాబట్టి అలా పనిచేసే అవకాశం లేదు.
కాంగ్రెసు పరిస్థితి...
రాష్ట్రంలో కాంగ్రెసు పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. అది బలం ప్రోది చేసుకోవడానికే అపసోపాలు పడుతోంది. ప్రత్యేక హోదాపై కెవిపి రామచందర్ రావు చేసిన పోరాటం కూడా జగన్కు, పవన్ కల్యాణ్కు ఉపయోగపడుతున్నట్లు అనిపిస్తోంది తప్ప కాంగ్రెసుకు ఉపయోగపడే పరిస్థితి కనిపించడం లేదు.
అనైక్యతే చంద్రబాబు బలం...
వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తన సత్తా చాటాలని జగన్ ఉవ్విళ్లూరుతున్నారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ కూడా జనసేన అభ్యర్థులను రంగంలోకి దింపుతారని అనుకుంటున్నారు. ఇరువురు రంగంలో ఉంటే అది చంద్రబాబుకు ఉపయోగపడే అవకాశాలు లేకపోలేదు. కాంగ్రెసు మాత్రం జగన్తోనైనా, పవన్ కల్యాణ్తోనైనా కలిసి పోరాటం చేసేందుకు సిద్ధపడవచ్చు.