యూపీ ఎన్నికలు: ఇలా అయితే ఎలా?
బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ నటించిన ‘ఓం శాంతి ఓం’ సినిమాలోని ‘పిక్చర్ అభీ బాకీ హై, మీర్ దోస్త్’ అనే డైలాగ్ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా సరిపోతుంది.
లక్నో: బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ నటించిన 'ఓం శాంతి ఓం' సినిమాలోని 'పిక్చర్ అభీ బాకీ హై, మీర్ దోస్త్' అనే డైలాగ్ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా సరిపోతుంది. సుదీర్ఘ ఏడు దశల పోలింగ్ ప్రక్రియ ముగిసి ఫలితాల కోసం ప్రధాన పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. తమదే మెజారిటీ అని పార్టీల అధినేతలు చెప్తున్నా.. లోలోపల మాత్రం త్రిశంకు సభ ఏర్పడే అవకాశాలను మాత్రం కొట్టి పారేయడం లేదు.
చివరిదశల్లో ప్రధాని నరేంద్రమోదీ విస్త్రుత ప్రచారం కారణంగా.. తొలిదశలో 403 స్థానాల్లో 300లకు పైగా సీట్లు గెలుచుకుంటామని వాదించిన అధికార సమాజ్ వాదీ పార్టీ - కాంగ్రెస్ కూటమి నేతలు కూడా త్రిశంకు సభ తప్పదన్న సంకేతాలిస్తున్నారు. యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ 300కి పైగా సీట్లు గెలుస్తామని కలలు కంటున్నారు. ఇక స్వయంగా ప్రధాని మోదీ సైతం హంగ్ అసెంబ్లీ ఏర్పాటవుతుందని అనుమానం వ్యక్తం చేయడం గమనార్హం.
ఎస్పీ, బీఎస్పీ బేరాసారాల కోసం వేచి చూస్తున్నాయని మోదీ ఆరోపించారు. యూపీ ఎన్నకల్లో బీజేపీ, అధికార ఎస్పీ - కాంగ్రెస్ కూటమి, బీఎస్పీ మధ్య హోరాహోరీ పోరు సాగింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సాధారణ మెజారిటీ సీట్లు 202 నియోజకవర్గాల్లో గెలుపొందేందుకు ఏ పార్టీ అయినా 35 శాతం ఓటు పొందాల్సిన అవసరం ఉంది. ఐదేళ్ల క్రితం ఎస్పీ కేవలం 29 శాతం ఓట్లతోనే 226 స్థానాల్లో విజయం సాధించి అధికారం చేపట్టింది.
మాయావతి సారథ్యంలోని బీఎస్పీ 26 శాతం ఓట్లతో కేవలం 80 స్థానాలకు పరిమితమైంది. ఈ రెండు పార్టీల మధ్య ఆధిపత్యం కోసం పోరాటం జరిగిన రెండేళ్లలోనే 2014లో అప్నాదళ్ పార్టీతో కలిసి లోక్ సభ ఎన్నికల్లో 80 స్థానాలకు 73 నియోజకవర్గాల్లో విజయం సాధించిన బీజేపీకి 42 శాతం ఓటింగ్ నమోదైంది. ఒకవేళ 2014 నుంచి ఇప్పటివరకు బీజేపీ ఏడు శాతం ఓట్లు కోల్పోయినా గెలుపొందే సామర్థ్యం ఉంది. ఇటు ఎస్పీ - కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు మరో ఆరు శాతం ఓట్లు పొందాల్సి ఉండగా, బీజేపీ 15 శాతం ఓట్లు అదనంగా రాబట్టాల్సి ఉన్నది.
కానీ యూపీ ఓటర్లు గత 14 ఏళ్లుగా త్రిశంకు సభ ఏర్పాటు అవకాశాలను తోసి రాజని 2007 నుంచి ఏదో ఒక పార్టీకి పూర్తి మెజారిటీ కట్టబెడుతూ స్పష్టమైన తీర్పునిస్తూ వచ్చారు. 1990వ దశకం వరకు సమాజ్ వాదీ పార్టీ, బీఎస్పీ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చాయి. ఒకవేళ బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే చిన్న పార్టీల మద్దతుతోగానీ, బీఎస్పీ సహకారంతోగానీ, చిన్న పార్టీల్లో చీలికల ద్వారా మాత్రమే సాధ్యమైందని గత అనుభవాలు, గణాంకాలు చెప్తున్నాయి.
ప్రజల మద్దతుపై అందరిలోనూ ధీమా
బీజేపీకి పట్టణ ఓటర్లు, యువత, అగ్ర కులాల మద్దతు పుష్కలంగా ఉంది. అఖిలేశ్ యాదవ్ తమ సంప్రదాయ ముస్లిం - యాదవ్ ఓటుబ్యాంకుతోపాటు కాంగ్రెస్ పార్టీతో పొత్తు కారణంగా ముస్లింల ఓటు బ్యాంక్ బీఎస్పీ వైపు వెళ్లకుండా సంఘటితం అవుతుందని ఆశాభావంతో ఉన్నారు. మాయావతి సారథ్యంలోని బీఎస్పీ గ్రామీణ ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు 97 స్థానాల్లో ముస్లింలను అభ్యర్థులుగా నిలిపింది. ఇక సంప్రదాయంగా దళితుల ఓట్లు తనకే పడతాయని ఆశిస్తున్నారు. బయటకు గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా.. అది ఏకపక్షంగా ఓట్లు పడితేనే సాధ్యమని అంతర్గత చర్చల్లో విశ్లేషిస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు 2019 లోక్ సభ ఎన్నికలనూ ప్రభావం చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కనుక ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేవలం రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటునే కాక లోక్ సభ ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులోనూ కీలకం కానున్నాయి. సీఎం పదవి నుంచి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోదీ రెండోదఫా ప్రజాతీర్పు తనకు అనుకూలంగా కోరనున్నారు.
యూపీతోనే ముడిపడ్డ రాష్ట్రపతి ఎన్నిక
మరో మూడు నెలల్లో జరిగే రాష్ట్రపతి ఎన్నికలకు ఉత్తరప్రదేశ్ శాసనసభలో బలాబలాలు, తద్వారా ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయాన్న ఖరారు చేయనున్నాయి. లోక్ సభలో బీజేపీ బలంలో యూపీ వాటా నాలుగోవంతు. 2007, 2012, 2014 సాధారణ ఎన్నికల్లో స్పష్టమైన ప్రజాతీర్పు వచ్చిన తర్వాత కూడా త్రిశంకు సభ ఏర్పడుతుందన్న అనుమానాలకు కారణంగా ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో ఒక ప్రచారాస్త్రం లేకపోవడమేనని విశ్లేషకులు చెప్తున్నారు. పెద్ద నోట్ల రద్దుతో కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు మద్దతుగా నిలుస్తారా? లేదా? అన్న సంగతీ తేలిపోతుంది.
విధేయతలు మారతాయా? అన్న అనుమానాలు
ప్రధాన పార్టీల మధ్య కులాలు, మతాల ప్రాతిపదికన సంప్రదాయ ఓటర్లలో చీలిక, విధేయతల్లో మార్పు విజయావకాశాలను దెబ్బతీస్తాయా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత సంప్రదాయంగా ఎస్పీకి మద్దతునిస్తున్న ముస్లింలు.. ఆ పార్టీలో అంతర్యుద్ధం వల్ల బీఎస్పీకి ఓటేయాలా? ఎస్పీకి బాసటగా నిలువాలా? వద్దా? అన్న విషయమై ముస్లింల్లో భారీ స్థాయిలో గందరగోళం నెలకొంది. అత్యధికంగా ముస్లింలకు బీఎస్పీ టిక్కెట్లు కేటాయించడం ద్వారా బీజేపీ అధికారంలోకి రాకుండా నిలువరించడంలో విజయం సాధించినట్లేనన్న అభిప్రాయం ఉంది. ఎన్నికల ముందు పరోక్షంగా, ఎన్నికల తర్వాత ప్రత్యక్షంగా అధికారం కోసం బీజేపీతో జత కట్టే అవకాశాలు ఉన్నందున బీఎస్పీకి ఓటేసే విషయమై ఆచితూచి స్పందించాలని ఎస్పీ హెచ్చరిస్తోంది.
కమలనాథులను నోట్ల రద్దు దండిస్తుందా?
బీజేపీలో సీఎం అభ్యర్థి లేకపోగా, ఒక్క ముస్లింకూ టిక్కెట్ ఇవ్వకపోవడంపై గందరగోళం నెలకొంది. దీని ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. దీనికి తోడు నోట్ల రద్దు ప్రభావం అదనంగా ఉంటుందంటున్నారు. అవినీతి ఆట కట్టించేందుకు నల్లధనాన్ని వెలికి తీసేందుకు పెద్ద నోట్లు రద్దుచేశామని కేంద్రం చేస్తున్న వాదన బీజేపీకి పూర్తిగా ప్రతికూలంగా మారే అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయి. పలువురు నగదు కోసం బ్యాంకుల ముందు బారులు తీరి మరణించి ఘటనలు ఉన్నాయి మరి. కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, ఉమా భారతి, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ వంటి వారు బహిరంగంగానే ముస్లింలకు టిక్కెట్లు కేటాయించకపోవడం వల్ల ఎన్నికల ఫలితాలపై తప్పక ప్రభావం చూపుతుందని తేల్చి చెప్పారు కూడా. ఎస్పీ - కాంగ్రెస్ కూటమి లేకుంటే తాము శక్తిమంతంగా ఎదిగే వారమని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ముస్లింలంతా ఎస్పీ - కాంగ్రెస్ కూటమికే మద్దతుగా నిలుస్తారని అంచనాల మధ్య రాజ్నాథ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
14 ఏళ్లుగా స్పష్టమైన తీర్పు
2007 తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కమ్యూనికేషన్స్ నెట్వర్క్ అభివ్రుద్ది చెందడమే ముఖ్యమైన పాత్ర పోషించిందని చెప్తున్నారు. పార్టీలో అంతర్యుద్ధం ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఉండబోదని ఎస్పీ నాయకత్వం భావిస్తున్ని. గత జనవరి ఒకటో తేదీన ప్రత్యేక జాతీయ సదస్సు నిర్వహించిన అఖిలేశ్ యాదవ్.. తన తండ్రి ములాయం స్థానే పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడంతోపాటు తన బాబాయి శివ్ పాల్ యాదవ్ ను పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా తొలగించారు. అమర్ సింగ్ ను పార్టీ నుంచి బహిష్కరించారు. కేంద్ర ఎన్నికల సంఘం ముందు కూడా అఖిలేశ్ వాదనే నెగ్గడం, సైకిల్ గుర్తు కూడా ఆయనకే కేటాయించిన తర్వాత పార్టీలోని వైరి పక్షాల మధ్య సఖ్యత ఒనగూడింది.
మాయకు దూరమైన సీనియర్లు
యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్కు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న బీఎస్పీ అధినేత మాయావతికి పార్టీ నుంచి సీనియర్ల వలసలు ప్రతికూలంగా మారింది. తొలి నుంచి ఆ పార్టీకి బాసటగా నిలుస్తున్న దళితుల 21.5 % ఓట్లు చెక్కు చెదరవని, 2007లో మాదిరిగా దళితులతోపాటు ముస్లింలు, బ్రాహ్మణుల కాంబినేషన్ కలిసి వస్తుందని ఆశాభావంతో ఉన్నారు. దీనికి పార్టీ సీనియర్ నేత ఎస్ సీ మిశ్రా బ్రాహ్మణులు సహా ఇతర సామాజిక వర్గాల మద్దతు కూడగట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. ఇక ముస్లింల మద్దతుపైనే ఆమె భవితవ్యం ఆధారపడి ఉంది.
లోక్సభ ఎన్నికల ఫలితాలతో కమలనాథుల్లో ఉత్తేజం
రెండున్నరేళ్ల క్రితం లోక్ సభ ఎన్నికల్లో అద్భుతమైన విజయాలు సాధించిన తర్వాత యూపీలోనూ గెలుపుపై బీజేపీ నేతలు ఆశలు పెంచుకున్నారు. పరివర్తన యాత్ర పేరిట బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పలు కార్యక్మరాలు నిర్వహించారు. కాకపోతే రాష్ట్రంలో ప్రజాదరణ గల నేత లేకపోవడంతో ప్రధాన ఆకర్షణ కూడా మోదీయే. ఎస్పీ, బీఎస్పీలకు వ్యతిరేకంగా వివిధ సామాజిక వర్గాలకు చెందిన చిన్న పార్టీలను కూడగట్టడంలోనూ అమిత్ షా కీలక పాత్ర పోషించారు. రామాయణంలో మాదిరిగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ 14 ఏళ్ల వనవాసానికి చరమగీతం పాడాలని ప్రజలకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్వయంగా విజ్నప్తి చేశారు.
పునర్వైభవంపై కాంగ్రెస్ ఆశలు
దాదాపు 40 ఏళ్ల పాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించిన కాంగ్రెస్ పార్టీ నిరాశా నిస్ప్రుహలు ఉన్నా.. 1989 నాటి పరిస్థితులకు పార్టీ పునర్వైభవానికి నిజాయితీగా కసరత్తు ప్రారంభించింది. 1990 నుంచి పేరుకే పోటీచేస్తున్న పార్టీగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తయారైంది. అయితే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నియమించుకున్న తర్వాత బీహార్లో మాదిరిగా కాంగ్రెస్ పార్టీలో పునరుత్తేజంపై ఆశలు రేకెత్తాయి. గమ్మత్తేమిటంటే ఎంతో పెద్ద రాష్ట్రమైన, కీలకమైన ఉత్తరప్రదేశ్లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి కారణంగా ఇప్పటి వరకు పది సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. అయితే ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో యూపీ ఓటరు స్పష్టమైన తీర్పునిస్తాడా? త్రిశంకు అసెంబ్లీని ఏర్పాటు చేస్తాడా? అన్న విషయం తేలాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే మరి.