ఇదీ వారసత్వంగానే బదిలీ: బాబుకు వాస్తు భయం.. అదే బాటలో కేసీఆర్
తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలోనూ చంద్రబాబు తన వైఖరి మార్చుకున్నారు. ఆయన ఏపీ సచివాలయంలో తన రూట్ మార్చారు.
హైదరాబాద్/ అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వలస పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు సీఎం చంద్రబాబుకు ఒక విషయంలో సారూప్యతలు ఉన్నాయి. ఇద్దరు అధినేతలు 'వాస్తు'కు పెద్దపీట వేస్తున్నారు.
1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాస్తుకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. 2004లో అధికారం కోల్పేయేనాటికి హైదరాబాద్ లోని సచివాలయం పాతకాలం నాటి ప్రవేశ ద్వారాన్ని మూసేశారు. లుంబినీ పార్క్ ముందు నూతన ప్రవేశ ద్వారాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ఆయనలో నెలకొన్న భయం 'వాస్తు' పీడిస్తుండటమే కారణం.
తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలోనూ చంద్రబాబు తన వైఖరి మార్చుకున్నారు. ఆయన ఏపీ సచివాలయంలో తన రూట్ మార్చారు. గేట్ నంబర్ 1 నుంచి కాకుండా గేట్ నంబర్ 2 నుంచి చంద్రబాబు సచివాలయంలోకి వెళుతున్నారు. వాస్తు కారణాలతోనే సీఎం రూట్ మార్చినట్లు అధికారులు చెప్తున్నారు.
హైదరాబాద్లో జుబ్లీహిల్స్ నివాసం ఇలా
కాగా ఓటుకు కోట్లు కేసుతో చిక్కుల్లో పడిన సమయంలోనూ చంద్రబాబు నాయుడు హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన ఇంటి వాస్తుపై దృష్టి కేంద్రీకరించారు. ఇందులో భాగంగా ఆయన తన రాకపోకల దారి మార్చుకున్న విషయం తెలిసిందే. అంతేకాక ఇంట్లో నుంచి బయటకు వచ్చాక ఇప్పటివరకూ కుడివైపు తిరిగేవారు. ఇక నుంచి ఎడమ వైపునకు తిరిగి రాకపోకలు సాగించేవారు. అలాగే పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ను కూడా వాస్తు ప్రకారం మార్పులు చేర్పులు చేసిన విషయం విదితమే.
ఎర్రగడ్డకు సచివాలయం మార్పునకు విఫలయత్నం
తెలంగాణ ఆవిర్భావం తర్వాత సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తొలి నుంచి వాస్తు సరిగ్గా లేదని పేర్కొంటూ అసెంబ్లీ మొదలు సచివాలయం వరకు.. అన్ని డైరెక్టరేట్లు మరో సురక్షిత ప్రదేశానికి తరలించాలన్న ప్రతిపాదన ముందుకు తెచ్చారు. తొలుత ఎర్రగడ్డలోని టీబీ హాస్పిటల్ను వికారాబాద్ నగరానికి తరలించాలన్న ప్రతిపాదన ముందుకు తెచ్చారు. ఎర్రగడ్డలో టీబీ ఆసుపత్రి స్థానంలో అన్ని హంగులతో సచివాలయం నిర్మిస్తామని కేసీఆర్ ప్రతిపాదన ముందుకు తెచ్చారు. గత జనవరి నాటికి కొన్ని శాఖలను పొరుగున ఉన్న బూర్గుల రామక్రుష్ణారావు భవన్ కు తరలించినట్లు వార్తలు వచ్చాయి. ప్రశ్నించిన విపక్షాలపై చుట్టూ ఉన్న మందీ మార్బలం విమర్శల వాన కురిపించారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ముందుకు సాగుతుంటే విపక్షాలు అడ్డుకుంటున్నాయని విమర్శలు సాగించారు.
సచివాలయంలో అన్ని కొత్త బ్లాక్ లే
గమ్మత్తేమిటంటే సచివాలయ మార్పిడి కోసం చర్చ జరిగినప్పటి నుంచి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. సీఎంవోకు.. తాజాగా ప్రగతి భవన్కు మాత్రమే పరిమితమయ్యారన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు సచివాలయం మార్పుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రతిస్పందించిన ప్రభుత్వం.. సచివాలయంలో పాత భవన బ్లాక్ ఫొటోలు న్యాయస్థానానికి సమర్పించింది. వాస్తవమేమటంటే ఒకటి, రెండు భవనాలు మినహా అన్ని బ్లాక్ లు కూడా చంద్రబాబు హయాంలో నిర్మించినవే. తాజాగా పరేడ్ గ్రౌండ్ పరిధిలోని బైసన్ గ్రౌండ్స్ పరిసర స్థలాలను సచివాలయం కోసం అప్పగించాలన్న కేసీఆర్ అభ్యర్థనకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
తెలంగాణపై ఇలా చంద్రబాబు ఇలా
బేగంపేటలోని సీఎంవో కార్యాలయం కూడా సరిగ్గా లేదని వాస్తు రూపేణా సమస్యలు తలెత్తుతున్నాయని సీఎం కేసీఆర్ భావించినట్లు సమాచారం. అందుకోసమే దాని ప్రక్కనే ఉన్న ప్రభుత్వ స్థలంలో పూర్తి హంగులతో ‘ప్రగతి భవన్' పేరిట మినీ సచివాలయాన్నే ఏర్పాటు చేసుకున్నారు. కనుక ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు వ్యవహార శైలి ఒక్కటే. కాకపోతే సీఎం కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ను, ఏపీ సీఎం చంద్రబాబు.. నవ్యాంధ్ర సెంటిమెంట్ రగిలించడంలో ముందు ఉంటారు.