హుధుద్ డేన జన్మించిన 245 మంది పిల్లలు
భువనేశ్వర్: భీకర తుపాను విధ్వంసం సృష్టించిన రాత్రి అంటే అక్టోబర్ 12న ఒడిశాలోని వివిధ ఆసుపత్రుల్లో 254 మంది పిల్లలు జన్మించారు. ఎటుపోయి ఎటు వస్తుందోనని ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్తల వల్ల ‘హుదూద్ బేబీలు' ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టారని జాతీయ మీడియాలో వార్తులు వచ్చాయి.
ప్రసవం తేదీకి ముందే గర్భిణీలను ఆసుపత్రులకు తరలించాల్సిందిగా ఆరోగ్య శాఖను ఒడిశా ప్రభుత్వం ఆదేశించింది. మొత్తం ఎనిమిది జిల్లాల్లో 245 మంది పిల్లలు జన్మించారు. నిజానికి ఆ జిల్లాల్లో 12వ తేదీ రాత్రి భారీ వర్షాలతో పాటు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి. ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తల వల్ల గర్భిణీలకు సుఖప్రసవం అయి పండంటి బిడ్డలకు జన్మనిచ్చారు.
నెలలు నిండిన దాదాపు 397 మందిని రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు వివిధ ఆసుపత్రుల్లో ముందే చేర్చారు. ‘అక్టోబర్ 12 రాత్రి 245 మంది బేబీలు గజపతి, కోరాపుట్, మల్కాన్గిరి, రాయగడ, నవగరంగపూర్, గంజాం, కలహండీ జిల్లాల ఆసుపత్రుల్లో జన్మించారని ప్రజావైద్యశాఖ డైరెక్టర్ కెసి దాస్ వెల్లడించారు. నవగరంపూర్లో 52 మంది జన్మించారు. కోరాపుట్లో 44, కంధమాల్లో 38, గంజాంలో 35, జగపతిలో 29, కలహండీలో 25, మల్కాన్గిరిలో 15, రాయకడలో ఏడుగురు పండంటి పిల్లలు జన్మించారని దాస్ స్పష్టం చేశారు.
తుపాను వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పటికీ జనరేటర్ల సహాయంతో కాన్పులు చేసినట్టు ఆయన తెలిపారు. కొందరికి సిజేరియన్లు చేసినట్టు ఆయన చెప్పారు. ప్రకృతి వైపరీత్యం సంభవించిన సందర్భంలో ఇలాంటి జననాలు కొత్తకాదు. 2013 ఫైలిన్ పెను తుపాను సంభవించిన రోజు, 1999 సూపర్ సైక్లోన్ సందర్భంలోనూ ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలు మంచి ఫలితాలే ఇచ్చాయి. గంజాంలో పుట్టిన పాపకు ఏకంగా ఫైలిన్ అని నామకరణ చేశారు. వారికి హుధుద్ పేరు పెడతారా చూడాలి.