బాబుకు ప్రాంతీయ బొప్పి: రాయలసీమ కోణం
అనంతపురం: తెలంగాణ, సీమాంధ్ర మధ్య పోరాటంలో తీవ్ర చిక్కులనే కాకుండా విమర్శలను కూడా ఎదుర్కున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆ సమస్యలు తప్పేట్లు లేవు. ఆనంతపురుం కాంగ్రెసు మాజీ పార్లమెంటు సభ్యుడు అనంత వెంకటరామి రెడ్డి చంద్రబాబుకు ప్రాంతీయ వివక్షను అంటగట్టే ప్రయత్నం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనంత వెంకట్రామి రెడ్డి మండిపడ్డారు. ప్రస్తుతం చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును ఆయన మీడియా సమావేశంలో తప్పు పట్టారు. నీటి కష్టాలతో రాయలసీమ అల్లాడుతున్నా పట్టించుకోవడం లేదని ఆయన చంద్రాబబును విమర్శించారు. చంద్ర బాబు ఒక ప్రాంతానికే సీఎంలా వ్యవహరిస్తున్నారన్నారు.
కండబలం ఉన్న వారే తాగునీరు తీసుకువెళ్తున్నారన్నారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?అని ప్రశ్నించారు. రాయలసీమ ప్రయోజనాలను వదిలి నాగార్జునసాగర్, పులిచింతలకు 80 క్యూసెక్కుల నీరు ఎలా ఇస్తారన్నారు. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలె చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని అనంత ఎద్దేవా చేశారు.
రాష్ట్ర విభజనకు ముందు చంద్రబాబు సీమాంధ్ర పట్ల ప్రేమను వ్యక్తం చేస్తున్నారని, తెలంగాణను పట్టించుకోవడం లేదని తెలంగాణ నాయకులు దుమ్మెత్తిపోశారు. చివరికి విభజన పూర్తయి రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత కూడా చంద్రబాబుకు ఆ తలనొప్పి తప్పడం లేదు. రాయలసీమ నేతలు ఆయనను ఒక ప్రాంతానికి ముఖ్యమంత్రిగా వ్యవహిస్తున్నారని విమర్శించడం చర్చనీయాంశంగా మారింది. నిజానికి, చంద్రబాబు రాయలసీమకు చెందిన నేత. అందునా చిత్తూరు జిల్లాకు చెందినవారు.