సర్వే: మా సంగతేమిటన్న హిజ్రాలు (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వేతో హిజ్రాలు చిక్కుల్లో పడినట్లు కనిపిస్తున్నారు. ఈ నెల 19వ తేదీన తెలంగాణ ప్రభుత్వం కుటుంబ సర్వే నిర్వహించాలని తలపెట్టింది. ఇందులో హిజ్రాల లెక్కలు తేల్చే కాలమ్ లేదు. దీంతో తమకు చెందిన వివరాలను సేకరించేందుకు సర్వేలో ప్రత్యేక కాలమ్ పెట్టాలని హిజ్రాలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
హిజ్రాల అవగాహనా సంస్థ సభ్యులు ఆ విషయంపై తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో వారు ఓ వినతిపత్రం సమర్పించారు. సర్వేలో అన్ని వర్గాల వివరాలు సేకరిస్తున్నందున తమ వివరాలు కూడా సేకరించాలని వారు కోరారు.
తమకు కుటుంబ వివరాలు లేవని, తాము హిజ్రా గురువులతో ఉంటామని, అందువల్ల తమకు ప్రత్యేకంగా సర్వేలో ఓ కాలమ్ కేటాయించాలని వారు కోరారు. సెక్షన్ బిలో తమ కోసం కాలమ్ పెట్టాలని వారు కోరారు.
హిజ్రాలను ఐదో కాలమ్లోని బిసి కులం కింద చేర్చాలని కూడా వారు విజ్ఞప్తి చేశారు. గురు కాలమ్ కేటాయిచడం ద్వారా తమ వివరాలు సేకరించాలని వారంటున్నారు.