లగడపాటి భార్యతో చేతులు కలిపిన కెటిఆర్ (ఫొటో)
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తనయుడు, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటి రామారావు తెలంగాణకు బద్ధవ్యతిరేకిగా భావించే మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ సతీమణి పద్మతో కరచాలనం చేశారు. ఇరువురు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. లడగపాటి ఎలా ఉన్నారంటూ కెటిఆర్ పద్మను ప్రశ్నించారు.
బుధవారం హైదరాబాద్లో నిర్వహించిన మహిళా పారిశ్రామిక వేత్తల సమావేశంలో వీరు కలిశారు. రెండు నిమిషాలపాటు మాట్లాడుకున్నారు. పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకున్నారు. రాజకీయాలు పక్కన పెట్టేసి మీవారు (లగడపాటి) హ్యాపీగా ఉన్నారా?' అని కెటిఆర్ పద్మను సరదాగా ప్రశ్నించారు.
ఔను... హ్యాపీగా ఉన్నారని పద్మ బదులిచ్చారు. ఆంధ్రా నుంచి వచ్చే ప్రైవేటు బస్సులను తిరగనివ్వబోమని తెలంగాణ రవాణ శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్న విషయాన్ని పద్మ సమావేశంలో ప్రస్తావించారు. దానిపై కెటిఆర్ను ఆమె ప్రశ్నించారు.
ఆంధ్రా నుంచి వచ్చే ప్రైవేటు బస్సులను అడ్డుకోవడం అసలు జరగదని, తమ మంత్రి మహీధర్ రెడ్డి అక్రమంగా తిరుగుతున్న బస్సుల గురించే చెప్పారని, ఒక్క పర్మిట్తో పది బస్సులు తిప్పుతున్న సంగతి అందరికీ తెలిసిందేనని, అలాంటి వాటినే అడ్డుకుంటామని కెటిఆర్ చెప్పారు.