పేరుకు ఇంజనీర్: వంద కోట్ల వజ్రాలు, పది కోట్ల కరెన్సీ
నోయిడా: వంద కోట్ల రూపాయల విలువైన వజ్రాలు, పది కోట్ల రూపాయల నగదు ఒకేచోట చూసిన ఆదాయపు పన్ను అధికారులు దిమ్మతిరిగిపోయారు. ఎనిమిది బ్యాగుల్లో నింపిన డబ్బుకట్టలు ఆ ఇంటి ఆవరణలోని ఆడీ కారులో చూసిన అధికారులు నోళ్లు వెళ్లబెట్టారు.
ఇంట్లో ఎంత ఉందోనన్న అనుమానంతో లోపలికి వెళ్లి వెదికితే.. ఏకంగా 2 కిలోల వజ్రాలు దొరకడంతో అధికారులకు నోట మాట రాలేదు. వీటి విలువ రూ.100 కోట్లదాకా ఉంటుందని అంచనా వేశారు. ఇంతకూ ఇదంతా ఏ బడా వ్యాపారవేత్త ఇంట్లోనో, అవినీతి రాజకీయ నేత నివాసంలోనో దొరికిన సంపద కాదు, ఉత్తరప్రదేశ్లోని ఒక ఇంజనీరుగారి నివాసంలో లభ్యమైంది. నోయిడాలో నివసించే ఈ ఘనత వహించిన ఇంజనీరు పేరు యాదవ్ సింగ్.
నోయిడా అథారిటీ చీఫ్ ఇంజనీర్గా అతను పనిచేస్తున్నాడు. ఆయన భార్య కుసుమలత డిజైనర్ క్లాత్స్ మ్యానుఫాక్చరర్స్ మీను క్రియేషన్స్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. గురువారం రాత్రి ఆ ఇంజనీర్ గారి ఇంట్లో సోదాలు నిర్వహించిన ఐటి శాఖ అధికారులకు దిమ్మి తిరిగే సంపద దొరికింది.
పది కోట్ల నగదును ఎనిమిది బ్యాగుల్లో నింపి కారులో పెట్టిన విషయాన్ని ఐటి అధికారులు గుర్తించారు. 130 మంది ఐటి శాఖ అధికారులు, అదే సంఖ్యలో పోలీసులు ఆపరేషన్ చేపట్టిన నోయిడా, ఘజియాబాద్, ఢిల్లీల్లోని 20 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. సమాజ్వాదీ పార్టీ అధికారంలోకి రాగానే ప్రభుత్వం యాదవ్ సింగ్ను సస్పెండ్ చేసింది.