'ఎన్టీఆర్పై కోపంతోనే రాజధానిగా గుంటూరు'
విజయవాడ: మహనీయుడు ఎన్టీఆర్పై ఉన్న ద్వేషంతోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి రాజధానిని విజయవాడ కాకుండా గుంటూరుకు మార్చారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు, మాజీ మంత్రి పార్థసారథి ఆరోపించారు. రాజధాన్ని అంశాన్ని కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు తన అనుభవాన్ని రంగరించి తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆరోపణలు గుప్పిస్తూ ప్రజల దృష్టిని మరల్చే యత్నం చేస్తున్నారని ఆయన నిన్న రంగా వర్ధంతి సభలో విమర్శించారు.
రాజధాని విషయంలో జగన్ స్పష్టంగా ఉన్నారని, ఎక్కడ పెట్టినా అభ్యంతరం లేదన్న విషయాన్ని గుర్తుచేశారు. రాజధాని నిర్మాణంలో లోపభూయిష్ట విధానాలనే తమ పార్టీ ప్రశ్నిస్తోందన్నారు. రాజధాని భూసేకరణను రెవెన్యూ శాఖను కాదని, మున్సిపల్ శాఖకు అప్పగించడంలో ఆంతర్యమేమిటని పార్థసారథి ప్రశ్నించారు. రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కూడా ప్రభుత్వ తీరును తప్పుబట్టారని గుర్తుచేశారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో పార్టీ క్యాడర్ చెక్కుచెదరకుండా పనిచేస్తోందని సారథి చెప్పారు. ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు టీడీపీ నాయకుల చేత వైఎస్సార్ సీపీ నేతలు పార్టీ వీడుతున్నట్లు అసత్య ప్రచారానికి తెరతీసి గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు తీరుపై ఇమడలేక సీనియర్ నాయకులే బయటకు వచ్చే పరిస్థితులు ఉన్నాయన్నారు. మంత్రులను మాట్లాడనివ్వడం లేదని ఉపముఖ్యమంత్రి కెఈ పార్టీలోకి ఎందుకొచ్చామా అని జేసీ దివాకర్రెడ్డి ప్రభుత్వ పాలనను ఎంపీ కేశినేని తప్పుబట్టిన విషయాలను ప్రస్తావించారు. దాళ్వాకు నీటి విడుదలపై మంత్రి ఉమా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.