వికారంగా మాట్లాడితే బాక్స్: వెంకయ్య సెటైర్లు
హైదరాబాద్: కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు ప్రసంగంతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు కడుపుబ్బ నవ్వారు. శుక్రవారం జరిగిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అవగాహన సదస్సులో నవ్వుల జల్లు కురిసింది.
కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఛలోక్తులతో ప్రసంగించి సభ్యులను ఉర్రూతలూగించారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో ఎవరైనా సభ్యుడు మంచిగా మాట్లాడితే మీడియాలో బాక్స్ కట్టి ముద్రించే వారని, ఇప్పుడేమో వికారంగా మాట్లాడితే బాక్స్ వేసి ముద్రిస్తున్నారని అన్నారు. ఎవరైనా సభ్యుడు ఎదుటి పక్షం సభ్యున్ని బయటకు రా.. చూసుకుందాం అని సవాల్ విసిరితే, సదరు సభ్యున్ని ప్రజలు శాశ్వతంగా బయటే ఉంచేస్తారని చెప్పారు.
సభాధ్యక్ష స్థానంలో ఉండే వారు ప్రతిపక్షాలకూ ఎక్కువ సమయం ఇవ్వకపోతే వారికి అధికారం లేకపోవడమే కాకుండా ప్రతిపక్షంలో మైకూ లభించక ఆందోళనకు దిగుతారని అని ఆయన అందరినీ నవ్వించారు. కాబట్టి సభాపతులు ప్రతిపక్షాలపై ప్రేమ చూపాలని చెప్పగానే కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు సభ్యులు కరతాళధ్వనులు చేశారు.
ప్రజాప్రతినిధులు సభలు, సమావేశాలకే కాకుండా పెళ్ళిళ్లు, పేరంటాలకు, కర్మకాండలకూ వెళ్ళాల్సి వస్తుందని, ఆ ఒక్కటీ తప్ప అన్నింటికీ వెళ్ళాల్సి ఉంటుందని ఆయన చెప్పగానే సభికులు నవ్వును ఆపుకోలేకపోయారు. కల్లు ముంత పెట్టుకుని తాగే వారితో కలిసి తాగితే వారు సంతోషిస్తారని, పేకాట ఆడే వారితో కలిస్తే వారూ సంతోషిస్తారని భావించే ప్రజాప్రతినిధులు ఉన్నారని ఆయన చెప్పగానే అందరూ పెద్దగా నవ్వారు.