ముంబైలో అనుష్క, కోహ్లీ జోడీ చేతిలో చేయి వేసి..
ముంబై: టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ, ఆయన ప్రేయసి అనుష్క శర్మ చేతిలో చేయి వేసుకుని ముంబై విమానాశ్రయంలో కనిపించారు. ఆస్ట్రేలియాపై ఐసిసి ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచులో విరాట్ కోహ్లీ ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా నుంచి ఆ ప్రేమ జంట తిరిగి వచ్చింది. వారు సాధారణమైన దుస్తుల్లో పరస్పరం చేతులు పట్టుకుని కనిపించారు.
విరాట్ కోహ్లీ వైఫల్యానికి క్రికెట్ అభిమానులు అనుష్క శర్మను దుమ్మెత్తి పోసిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితిలో విరాట్ కోహ్లీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో భరోసా ఇస్తున్నట్లుగా అనుష్క శర్మ చేతిని పట్టుకుని ముందుకు నడిచాడు.
ఒక్క పరుగు మాత్రమే చేసి ఆస్ట్రేలియా చేతిలో అవుటైన విరాట్ కోహ్లీపై కూడా తీవ్రమైన విమర్శలు వచ్చాయి. కోహ్లీ వైఫల్యంపై అనుష్క శర్మ తీవ్ర విచారం కూడా వ్యక్తం చేసింది. విరాట్ కోహ్లీపై, అనుష్క శర్మపై వచ్చిన విమర్శలను కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తప్పుపట్టాడు. వారి తప్పేమీ లేదని ఆయన అన్నాడు.
అనుష్క శర్మపై జోకులు, విమర్శలు పేలుతూ వచ్చిన ట్వీట్లు అమర్యాదకరమైనవని బాలీవుడ్ స్టార్స్ ప్రియాంక చోప్రా, అభిషేక్ బచ్చన్, రిషీ కపూర్ అన్నారు. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా అనుష్క తరఫున వకాల్తా పుచ్చుకున్నారు.