మోడీకి పవన్ రివర్స్: ప్రశ్నించేందుకు బాబుతో దోస్తీ
హైదరాబాద్: మొన్న రైల్వే బడ్జెట్, నిన్నటి సాధారణ బడ్జెట్ పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఏపీకి కేంద్రం ఏం చేయడంలేదని ప్రధాని మోడీ పైన అసంతృప్తితో ఉన్న చంద్రబాబు, పవన్లు... ఒక్కటవుతున్నారా? అనే చర్చ సాగుతోంది. అందుకు చంద్రబాబు ఇంటికి పవన్ స్వయంగా వెళ్లడమే నిదర్శనమంటున్నారు.
విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్లో ఉంది. అంతేకాకుండా రాజధానిని నిర్మించుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం పైన ఏపీ బాగా ఆశలు పెట్టుకుంది. అయితే, తమకు చేయి విదిల్చారని ఏపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ మిత్రపక్షం టీడీపీ, బీజేపీకి సార్వత్రిక ఎన్నికల్లో అండగా నిలిచిన పవన్, విపక్షాలైన కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు కూడా మండిపడుతున్నాయి.
ఎన్నికల ప్రచార సమయంలో పవన్ బీజేపీకి అనుకూలంగా విస్తృతంగా పర్యటించారు. మోడీ సభల్లో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ బీజేపీకే అనుకూలంగా ఉన్నారని, కమలం పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్లే తప్పని పరిస్థితుల్లో చంద్రబాబుతో వేదిక పంచుకున్నారని, టీడీపీకి మద్దతుగా ప్రచారం చేశారనే వాదనలు వినిపించాయి. అయితే, ఇప్పుడు రివర్స్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది.
నాడు బీజేపీకి ప్రచారం చేయడంతో పాటు.. నిన్న ప్రధాని మోడీ పాలనకు కితాబిచ్చే వరకు పవన్ కమలం పార్టీ వైపు ఉన్నప్పటికీ.. రైల్వే, సాధారణ బడ్జెట్ తర్వాత మనసు మార్చుకున్నారని అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబుతో కలిసి ఆయన ఏపీ కోసం కేంద్రంతో పోరాటం చేసినా చేయవచ్చునని అంటున్నారు. ఇరువురు నేతలు కలిసి కేంద్రాన్ని ఏపీకి సాయం కోరుతారని, కుదరకుంటే కలిసి నిలదీసే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు.
బడ్జెట్ పైన అసంతృప్తితో ఉన్న చంద్రబాబు తన స్వరం పెంచారు. పవన్ కళ్యాణ్ కూడా ప్రధాని మోడీ ప్రభుత్వం పైన స్వరం పెంచాల్సిన సమయం వచ్చిందని చంద్రబాబు ఆయనకు సూచించనున్నారని అంటున్నారు. ప్రత్యేక హోదా, స్పెషల్ ప్యాకేజీల కోసం నిలదీయాల్సి ఉందని ఇరువురు నేతలు భావిస్తున్నారు. చంద్రబాబు-పవన్ ఒక్కటై మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారని అంటున్నారు.