ఆసక్తి: ప్రణబ్ కారులో గంటపాటు చంద్రబాబు
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్టప్రతి ప్రణబ్ముఖర్జీతో కలిసి ఒకే కారులో దాదాపు 1.10 గంటల పాటు ప్రయాణం చేశారు. బుధవారం రాష్టప్రతి తిరుపతి పర్యటనలో చంద్రబాబుకు ఈ అరుదైన అవకాశం బాబుకు లభించింది. అవకాశం చిక్కితే దాన్ని వాడుకోగల సమర్థుడు చంద్రబాబు.
రాష్టప్రతితో గంటకుపైగా గడిపే అవకాశాన్నిచంద్రబాబు ఎలా వాడుకున్నారనేది ఆసక్తికరమైన విషయంగా మారింది. తిరుమల, తిరుపతి, తిరుచానూరు పుణ్యక్షేత్రాల సందర్శనకు రాష్టప్రతి ప్రణబ్ముఖర్జి తన కుమారుడు అభిజిత్ ముఖర్జీతో కలిసి బుధవారం రేణిగుంట విమానాశ్రయానికి వచ్చారు. గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ హైదరాబాద్ నుండి రాష్టప్రతితో పాటు ప్రత్యేక విమానంలో వచ్చారు.
ప్రభుత్వం తరపున రాష్టప్రతికి స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గంటకు ముందుగానే విమానాశ్రయం చేరుకున్నారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు రాష్టప్రతి విమానాశ్రయం చేరుకోగానే చంద్రబాబు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ నుండి రాష్టప్రతి తిరుచానూరు బయలుదేరే సమయంలో తన కారులో కూర్చోవాలని బాబును ముఖర్జీ ఆహ్వానించారు.
అక్కడ నుండి తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, అక్కడ నుండి కపిలేశ్వర స్వామి ఆలయం వరకూ అక్కడ నుండి తిరుమల పద్మావతి అతిథిభవనం వరకూ చంద్రబాబు రాష్టప్రతి కారులోనే ప్రయాణం చేశారు. తిరుగుప్రయాణంలో మాత్రం తిరుమల నుండి రేణిగుంట వరకూ రాష్టప్రతి కారులో గవర్నర్ నరసింహన్ ప్రయాణం చేశారు.
ఆ రకంగా ప్రణబ్తో కలిసి చంద్రబాబుకు కలిసి ప్రయాణం చేసే అవకాశం లభించింది. ఈ సమయంలో చంద్రబాబు ఆయనతో ఏమి మాట్లాడి ఉంటారన్నదే ఇప్పుడు చర్చనీయాశంగా మారింది. నోటుకు ఓటు కేసులో తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్న తరుణంలో ఆసక్తి చెలరేగడం సర్వసాధారణమే.
రెండురోజుల ముందు హైదరాబాద్కు వచ్చిన రాష్టప్రతికి విమానాశ్రయంలో తెలంగాణ సిఎం కెసిఆర్ పాదాభివందనం చేశారు. అది రాష్టప్రతిపై ఉన్న గౌరవ మర్యాదలు కావచ్చు, మరేదైనా కావచ్చు. అటు తరువాత గవర్నర్ ఇచ్చిన విందుకు జ్వరం కారణంగా కెసిఆర్ హాజరు కాలేక పోయారు. అయితే ఆ విందుకు చంద్రబాబు హాజరయ్యారు.