అసాధారణ మాతృమూర్తి: 42ఏళ్లు మగాడిగా..
కైరో: తల్లి ప్రేమ ఎంత గొప్పదో ఈ మాతృమూర్తిని చూస్తే తెలుస్తుంది. తన కూతురు కోసం ఓ తల్లి పడిన తపన ఎందరినో కదిలించింది. ఆమె ఏకంగా 42ఏళ్లు మగాడిగా వేషం ధరించి తన కూతురును పోషించుకుంది. ఆమె చూపిన అసాధారణ ప్రేమకు ఆ దేశ ప్రభుత్వం కూడా ఆమెకు ప్రత్యేకమైన అవార్డును అందజేసింది. ఈ అవార్డు అందుకున్న ఆ మాతృమూర్తి ఈజిప్టు దేశానికి చెందిన సిసా అబు దావుహ్.
ఆమె కట్టుకున్నవాడు చనిపోతే.. మతాలు, కట్టుబాట్లను ఎదిరించి.. స్వశక్తితో కన్నబిడ్డను సాకింది. 42 ఏళ్లు మగాడిగా వేషం వేసుకుని కూలి, బూట్ పాలిష్ పనులు చేసింది. ఇస్లాం మత సంప్రదాయాల ప్రకారం మహిళలు బురఖా లేకుండా బయటకు రావొద్దు.. కూలి పనులు, మగవారు చేసే పనులు చేయడంపై నిషేధం ఉంది. సంప్రదాయ ఇస్లాం దేశమైన ఈజిప్ట్లో చట్టప్రకారం సిసాను కఠినంగా శిక్షించవచ్చు.
కానీ, సిసా చేసిన పనిని ఎవరూ తప్పుపట్టలేదు. స్థానిక మీడియా ఆమె త్యాగాన్ని కొనియాడింది. స్వయానా ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్ సిస్సి కూడా సిసాకు సలాం కొట్టారు. అసాధారణ మాతృమూర్తి అవార్డు ఇచ్చి ఘనంగా సత్కరించారు. సిసా అబు దావుహ్ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంది.
10 ఏళ్ల వయస్సులోనే సిసాకు పెళ్లయ్యింది. ఆ తర్వాత కొద్దికాలానికే ఆమె భర్త మృతిచెందాడు. అప్పటికే వారికి ఓ పాప పుట్టింది. ఈజిప్ట్లో వితంతువులు బయట తిరగడం నిషేధం. బిడ్డను పట్టుకుని బిచ్చమెత్తుకుని జీవించాలి. లేదా పుట్టింటి, అత్తింటి పంచన బతకాలి. కానీ, సిసాకు ఇది ఇష్టంలేదు. తన బిడ్డను స్వశక్తితో, ఆత్మగౌరవంతో పోషించాలని నిర్ణయించుకుంది.
అంతే, మగాడిలా వేషం ధరించి, పొడవాటి గౌనులాంటి కుర్తా(గలాబేయ) వేసుకుని, తలపాగా కట్టుకుని అచ్చం మగాడిలా తయారైంది. సమీపంలోనున్న లక్సర్ పట్టణానికి వెళ్లి అడ్డా కూలీలా పనిచేసింది. 12 ఏళ్లు అలా పనిచేశాక, శరీరం సహకరించకపోవడం.. ఆదాయం అంతంతమాత్రంగానే ఉండటంతో బూట్ పాలిష్ను వృత్తిగా ఎంచుకుంది.
అప్పటికీ ఆమెను విధి కరుణించలేదు. కూతురికి పెళ్లి చేసి.. సాగనంపినా, కొంతకాలానికే అల్లుడు మంచం పట్టాడు. కూతురు పెళ్లితో కష్టాలు తీరాయని భావించిన సిసా.. వారి బాధ్యతను కూడా భుజాన వేసుకుంది. 2013లో దేశంలో మోర్సీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. లింగవివక్ష తగ్గడంతో తాను మహిళనన్న విషయాన్ని తన సన్నిహితులకు తెలిపింది. వారి ద్వారా విషయం తెలుసుకున్న స్థానిక మీడియా ఆమె త్యాగంపై ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది.
ప్రభుత్వం ఆసరా ఇచ్చింది కదా..? ఇంకా మగాడిలానే పనిచేస్తారా..? అన్న మీడియా ప్రశ్నకు ఆమె బదులిస్తూ.. ‘పనిచేయడం అలవాటైంది. ఇప్పుడు ఇంట్లో కూర్చుని ఉండలేను. ఓపిక ఉన్నంతవరకు పనిచేస్తూనే ఉంటాను' అని సిసా పేర్కొన్నారు. కాగా, గతవారం మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఆమెను అసాధారణ మాతృమూర్తి అవార్డు ఇచ్చి ఘనంగా సత్కరించింది. తన తల్లి తనకు గురువు, దైవం అన్నీ అని సిసా కూతురు తెలిపింది.