2013-14లో గుర్తించిన నల్లధనం 7,800 కోట్లకు పైనే
న్యూఢిల్లీ: భారత దేశంలో, విదేశాల్లో 2013-14 సంవత్సరంలో రూ.7,800 కోట్ల నల్ల ధనాన్ని ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఇది ఆర్థిక శాఖకు చెందిన విభాగం. ఆర్థిక మంత్రిత్వ శాఖ రూపొందించిన తాజా నివేదిక ప్రకారం ఎఫ్ఐయూ తీసుకున్న చర్యలతో ఆదాయం పన్ను విభాగం 7,078కోట్ల రూపాయల లెక్కల్లోకి రాని ఆదాయాన్ని గుర్తించింది.
అంతేకాకుండా, రూ.750 కోట్ల మేర పన్ను ఎగవేతలను కస్టమ్స్, సేవా పన్ను విభాగాలు గుర్తించాయి. దేశవ్యాప్తంగా వివిధ ఆర్థిక సంస్థల నుంచి సంపాదించిన అనుమానాస్పద లావాదేవీల నివేదిక (ఎస్టీఆర్)లను ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఈ సాంకేతిక నిఘా విభాగం జల్లెడపట్టిన అనంతరం ఎన్ఫోర్స్ విభాగం కూడా రూ.20 కోట్ల మేర నేరపూరిత ఆదాయాన్ని గుర్తించింది. అందులో రూ.17 కోట్ల విలువైన ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంది.
ఎఫ్ఐయూ జరిపిన ఈ ఎలక్ట్రానిక్ నిఘా ఫలితంగా ఆదాయం పన్ను విభాగం 163 కోట్లు, సేవాపన్నుల విభాగం రూ.17 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్టు కూడా పీటీఐ సంపాదించిన ఈ నివేదిక పేర్కొంది.
ఈ చర్యలో భాగంగా ఈడీ మనీ లాండరింగ్, హవాలా కార్యకలాపాలు నిర్వహించే వారిపై తాము రెగ్యులర్గా జరిపే దాడులకు సంబంధించి దాఖలు చేసే ఎఫ్ఐఆర్లు కాకుండా అదనంగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద 105 ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేసింది.
ఎఫ్ఐయూ గత ఆర్థిక సంవత్సరంలో గుర్తించిన మొత్తం నల్లధనం 7,848 కోట్ల ఉన్నట్టు పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారని వార్తలు వస్తున్నాయి.
తాము చేసిన అభ్యర్థనలకు అందిన ఎస్టీఆర్ల సంఖ్య అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఒక్కసారిగా రెట్టింపు కావడాన్ని ఎఫ్ఐయూ గుర్తించడంతోనే ఇంత భారీ మొత్తంలో నల్లధనాన్ని గుర్తించ గలిగారు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ఐయూకు 31,731 ఎస్టీఆర్లు అందగా, 2013-14లో 61,953 అందాయి.