హార్దిక్ పటేల్పై డబ్బుల వర్షం, నెట్లో హల్చల్(వీడియో)
అహ్మదాబాద్: పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి (పీఏఏఎస్) నాయకుడు హార్దిక్ పటేల్ పైన కరెన్సీ నోట్లు గుమ్మరిస్తున్నట్లు కనిపిస్తున్న దృశ్యం ఒకటి ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. సూరత్ జిల్లాలోని గోసామాడా జానపద సంగీత కార్యక్రమం (దైరో)లో ఆదివారం మాట్లాడుతున్న సమయంలో ఈ నోట్ల వర్షం కురిసింది.
హార్దిక్ పటేల్ ప్రసంగిస్తున్నప్పుడు ఆయన మద్దతుదారులు అతని పైన డబ్బు నోట్ల వర్షం కురిపించారు. కార్యక్రమ నిర్వాహకులు నగదు వెదజల్లవద్దని పదేపదే కోరినా వారు పట్టించుకోలేదు. ఈ దృశ్యంతో కూడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
సంబంధిత దృశ్యం యూట్యూబ్తో పాటు, సామాజిక అనుసంధాన వేదికల్లో హల్చల్ చేస్తోంది. దీనిలో హార్దిక్ మద్దతుదారులు.. ''జై పటీదార్ జై సర్దార్''అని నినాదాలు చేస్తూ కనిపించారు.
గుజరాత్లోని దైరో లాంటి ప్రత్యేక కార్యక్రమాల్లో నోట్లను గుమ్మరించడం సర్వసాధారణమని హార్దిక్ సన్నిహితులు చెబుతున్నారు. ఇలాంటి వేడుకల్లో నగదు వెదజల్లడం సాధారణమేనని హార్దిక్ అనుచరుడు దినేశ్ బాంభానియా వ్యాఖ్యానించారు.
బహిరంగ సభ నిర్వహించేందుకు రాష్ట్ర సర్కారు అంగీకరించకపోవడంతో దైరోకి హార్దిక్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హార్దిక్ పటేల్ మాట్లాడుతూ... గత ఆగస్టులో అహ్మదాబాద్, మెహ్సానా, సూరత్ సహా రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో తమ సామాజిక వర్గంపై జరిగిన దాడులను మర్చిపోవద్దన్నారు.
తొమ్మిది మంది పాటిదార్ యువ మృత వీరులను మర్చిపోవద్దన్నారు. ఇదే తరహా ఆందోళన కొనసాగుతుందన్నారు. అహ్మదాబాద్ మాదిరిగానే సౌరాష్ట్ర కూడా ఆగస్టు 25వంటి ర్యాలీకి వేదిక అవుతుందని హార్దిక్ పటేల్ చెప్పారు.