రేవంత్ రెడ్డి తీరుపై టడిపి నేతల వేడి వ్యాఖ్యలు?
హైదరాబాద్: మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ తమ పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి తీరు పట్ల తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ఆగ్రహం శుక్రవారంనాడు జరిగిన సమావేశంలోనూ వ్యక్తమైనట్లు చెబుతున్నారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎల్ రమణ తదితరులు శుక్రవారంనాడు సమావేశమయ్యారు.
చంద్రబాబుతో జరిగిన సమావేశంలో రేవంత్ రెడ్డి తీరుపై వేడిగా, వాడిగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పార్టీ సమావేశాలకు రేవంత్ రెడ్డి హాజరు కావడం లేదని వారు చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి ఏదో మాట్లాడుతారని, ఆ తర్వాత దాన్ని వదిలేస్తారని వారు చెప్పినట్లు తెలుస్తోంది. మీడియా సమావేశంలో తనకు ఇష్టం వచ్చింది మాట్లాడి, దాన్ని తుది దాకా తీసుకుని వెళ్లరని అన్నట్లు సమాచారం.
ఓ అంశంపై మాట్లాడిన తర్వాత ఆ తర్వాత పరిణామాల మేరకు దానిపై మాట్లాడడం కొనసాగించాల్సి ఉంటుందని, రేవంత్ రెడ్డి అలా చేయడం లేదని, ఆ అంశాన్ని మధ్యలోనే వదిలేస్తారని, ఇది అంగీకారయోగ్యం కాదని తెలంగాణ టిడిపి నేతలు కొందరు చంద్రబాబుతో అన్నట్లు చెబుతున్నారు.
రామేశ్వర రావు మై హోం వ్యవహారంలో ఇంతకు ముందు రేవంత్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి తీరును ఎర్రబెల్లి దయాకర్ రావు తప్పు పట్టారు. ఈ వివాదం చంద్రబాబు దాకా వెళ్లింది.