రాజకీయాలపై విరక్తి: జయసుధ ఏం చేస్తున్నారు?
హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రోద్బలంతో రాజకీయాల్లోకి వచ్చి ఓసారి శాసనసభ్యురాలిగా పనిచేసిన ప్రముఖ సినీ నటి జయసుధ గుర్తుండే ఉంటారు. శాసనసభ్యురాలిగా ఉన్నప్పుడే ఆమె పలుమార్లు రాజకీయాల పట్ల తీవ్రమైన విరక్తి ప్రదర్శించారు. అయినా, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే, ఆమెకు దానికి సంబంధించిన బాధ ఏమీ లేనట్లే ఉంది.
ప్రస్తుతం ఆమె కొత్త అవతారం ఎత్తారు. ఆమె ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్గా మారిపోయారు. సినీ నేపథ్యం నేర్పించిన ఫ్యాషన్ పాఠాలు ఆమెకు ఇందులో బాగా పనికి వస్తున్నట్లే ఉంది. సంప్రదాయ డిజైన్లకు కొత్త రకం పోకడలను చేర్చి ఆమె డిజైన్లను ఆవిష్కరించారు
తాను డిజైన్ చేసిన కలెక్షన్లను ఆమె జె8 బై జయసుధ పేరుతో హైదరాబాదులోని తాజ్ బంజారాలో ప్రదర్శనకు పెట్టారు. సోమవారంనాడు ఆ ఎక్స్పో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆమె సాక్షి సిటీ ప్లస్తో ఆమె మాట్లాడారు. తనకు డిజైన్ల ఆసక్తి ఎలా పెరిగిందనే విషయాన్ని ఆమె పంచుకున్నారు. అమ్మాయిల టేస్ట్ గురించి ఆమె చెప్పారు.
జయసుధ కాంగ్రెసు పార్టీ తరఫున సికింద్రాబాద్ శాసనసభా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అంతకు ముందు అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హైదరాబాద్ మేయర్గా ఉన్న కార్తిక రెడ్డితో ఆమెకు పడేది కాదు. పలుమార్లు ఈ వివాదంపై ఆమె కాంగ్రెసు రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారు.