రాత్రికి రాత్రే రైతు ఆత్మహత్యలు నివారించలేం: కేటీఆర్
హైదరాబాద్: రాత్రికి రాత్రే రైతు ఆత్మహత్యలను నివారించడం సాధ్యం కాదని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వ్యాఖ్యానించారు. వాటిని అరికట్టడానికి తమ వద్ద మంత్రదండం లేదన్నారు.
రబీలో వరిసాగు వద్దని పిలుపు ఇచ్చామని చెప్పారు. దాంతో విస్తీర్ణం తగ్గిందని, అలా చెప్పకపోయి ఉంటే ఆత్మహత్యలు ఇంకా ఎక్కువగా జరిగేవని తెలిపారు. వ్యవసాయ సంక్షోభంపై లోతైన విశ్లేషణ, అధ్యయనం జరగాల్సి ఉందని కేటీఆర్ అన్నారు.
సహకార రంగంలో ఉన్న రూ.650 కోట్ల రుణాలను మాఫీ చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిర్ణయించారన్నారు. అదే సమయంలో తెలంగాణ చరిత్రలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పేరు లేదన్న కాంగ్రెస్ పార్టీ నేతల విమర్శల పైన స్పందించారు.
సోనియా గాంధీ పేరును తెలంగాణ చరిత్రలో పొందుపర్చాలంటే.. మొదట ఆమె, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు చేసిన ద్రోహం గురించి చర్చించవలసి ఉంటుందని, తెలంగాణ ఉద్యమం మొదటి దశలో 360మంది, మలి దశలో 1200 మంది మృతి చెందడానికి కాంగ్రెస్, సోనియా కారణం కాదా అని ప్రశ్నించారు.
హైదరాబాద్ను తానే అభివృద్ధి చేశానన్న చంద్రబాబు వ్యాఖ్యలను కేటీఆర్ కొట్టిపారేశారు. బాబు అతిగా ఊహించుకుంటున్నారని, ఒక వ్యక్తి వల్ల ఏదీ జరగదన్నారు. ఆయన కొంత ప్రయత్నం చేసి ఉండవచ్చునని కానీ, ఆయన పుట్టకముందే హైదరాబాద్ రాష్ట్రం మిగులు రాష్ట్రంగా ఉందన్నారు.
అభివృద్ధి చేసినట్టు చెబుతున్న పార్టీ ఇక్కడ ఎందుకు ఓడిపోయిందని, గూగుల్ వంటి సంస్థ ఏపీకి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. రాజకీయ పునరేకీకరణలో భాగంగానే తెరాసలోకి ఇతర పార్టీల నేతలు వస్తున్నారన్నారు. అందులో ఎలాంటి తప్పు లేదన్నారు. రాజకీయ పదవులు శాశ్వతం కాదని, తాను రేపటి గురించి ఆలోచించడం లేదని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.