సభలో లేని ప్రతిపక్షాలు: మజా లేదంటున్న కెటిఆర్
హైదరాబాద్: శాసన సభ సమావేశాలలో ప్రతిపక్షాలు ఉంటే మజా ఉండేదని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం నాడు అభిప్రాయపడ్డారు. మంగళవారం జలహారం (వాటర్ గ్రిడ్) పైన సభలో వివరణ ఇచ్చారు.
అనంతరం ఆయన సభ నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో పిచ్చాపాటీగా మాట్లాడారు. ప్రతిపక్షాలు లేకుండా సభను నడపడం ఎలా ఉంది అని విలేకరులు ప్రశ్నించారు. దానికి కెటిఆర్ స్పందిస్తూ... ప్రతిపక్షాలు సభలో ఉంటే మజాగా ఉండేదని వ్యాఖ్యానించారు.
తెలంగాణ శాసనసభ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే సభాపతి మధుసూదనాచారి ప్రశ్తోత్తరాలు చేపట్టారు. ఈ సమయంలోను ఓ సభ్యుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హాస్టళ్లలో, పాఠశాలల్లో మధ్యాహ్నం సమయంలో దొడ్డుబియ్యం బదులు సన్నబియ్యం ఇస్తున్నామని, అలాగే, గతంలో గ్రాముల చొప్పున విద్యార్థులకు భోజనం పెట్టేవారని, ఇప్పుడు తమ ప్రభుత్వం దానిని తీసేసిందని, ఎవరు ఎంత తింటే అంత తినేలా చర్యలు చేపట్టిందని, ఇలాంటి మంచి విషయాలు వినేందుకు సభలో ప్రతిపక్షాలు లేవని, రాష్ట్రంలో అందరూ సంతోషంగా ఉంటే.. ప్రతిపక్షాలు మాత్రం రోడ్డెక్కాయని అభిప్రాయపడ్డారు.