కెసిఆర్తో హీరో అక్కినేని నాగార్జున ప్యాచప్?
హైదరాబాద్: టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో సయోధ్యకు ప్రయత్నిస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తన తండ్రి అక్కినేని నాగేశ్వర రావు పేర పెట్టిన పురస్కారాన్ని ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్కు ప్రదానం చేసిన సమయంలో నాగార్జున ఆ ప్రయత్నాలను ప్రారంభించినట్లు చెబుతున్నారు.
నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కోసం ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగార్జునకు కెసిఆర్కు మధ్య దూరం పెరిగినట్లు భావిస్తున్నారు. పైగా, ఎన్ కన్వెన్షన్ను వ వేడుకలకు వాడుకోవడానికి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నాయకులంతా వెనకాడుతూ వచ్చారు. నిజానికి, వివాహ వేడుకలకు అది చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే, ఆక్రమణ ఆరోపణల నేపథ్యంలో తెలంగాణకు చెందిన ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు దాన్ని వాడుకోవడానికి వెనకాడుతూ వచ్చారు.
ఓ ఉన్నతాధికారి వివాహ వేడుక కోసం తొలుత ఎన్ కన్వెన్షన్ను బుక్ చేసుకుని, ఆ తర్వాత తన సహచరుడి సలహాతో దాన్ని రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. తన కూతురు వివాహ వేడుక వేదికను ఆ తర్వాత హైటెక్స్కు మార్చుకున్నారట. అమితాబ్ బచ్చన్ ఇటీవల అక్కినేని నాగేశ్వర రావు అవార్డును స్వీకరించేందుకు హైదరాబాద్ వచ్చినప్పుడు కెసిఆర్ను కలిశారు.
ఆ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి కెసిఆర్ కూడా హాజరయ్యారు. సినిమా రంగం హైదరాబాదు నుంచి ఎటూ తరలిపోదని ఈ సందర్భంగా కెసిఆర్ హామీ కూడా ఇచ్చారు. మొత్తం మీద, కెసిఆర్తో స్నేహాన్ని పునరుద్ధరించుకోవడానికి నాగార్జునకు అవకాశం చిక్కిందని అంటున్నారు. రాజన్న సినిమా షూటింగ్ సమయంలో నాగార్జున కెసిఆర్ను కలిసి, ఆయన సలహాలు కూడా తీసుకున్నారు.