బాబుకు రాజ్నాథ్ ఝలక్: ఫ్రీజోన్, హైదరాబాద్లపై..
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ అడ్డుపుల్ల వేశారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ శాంతి భద్రతల బాధ్యతను గవర్నర్కు అప్పగించడం,విజయవాడతో పాటు కొత్త రాజధాని ప్రాంతాన్ని ఫ్రీజోన్ చేసే అంశంపై విభేదాలు తలెత్తాయి.
దాంతో కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరగాల్సిన సమావేశాన్ని వాయిదా వేయించినట్టు తెలిసింది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన దాదాపు 1500మంది విద్యుత్ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం తొలగించిన నేపథ్యంలో హైదరాబాద్ శాంతి భద్రతల బాధ్యతను గవర్నర్కు అప్పగించాలని శనివారంనాటి సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించాలని చంద్రబాబు భావించారు.
అయితే తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ శాంతిభద్రతలను గవర్నర్కు అప్పగించాలనే ప్రతిపాదనను తీవ్ర స్థాయిలోనే తన నిరసనను కేంద్రానికి తెలిపినట్టు తెలుస్తోంది. ఇదే విధంగా విజయవాడ, రాజధానిని ప్రాంతాన్ని ఫ్రీజోన్ చేయాలన్న చంద్రబాబు డిమాండ్ను హోం శాఖ తిరస్కరించినట్టు తెలిసింది.
కొత్త రాజధాని ఏర్పడిన మరుక్షణం దాని పరిధిలోకి వచ్చే ప్రాంతమంతా ఎలాగూ ఫ్రీజోన్ అవుతుందని, అలాంటప్పుడు ఇప్పుడే ఈ ప్రకటన ఎందుకు చేయాలని హోం శాఖ చంద్రబాబును ప్రశ్నించినట్టు తెలిసింది.