మైక్ కట్: కేసీఆర్పై లోకేష్ సెటైర్, బాబు నో రెస్పాన్స్
హైదరాబాద్: కార్యకర్తల సంక్షేమం పైన తీర్మానం ప్రవేశపెట్టిన నారా లోకేష్ మాట్లాడేందుకు మైక్ తీసుకోగానే ఆగిపోయింది. ఏమిటా అని చూస్తే విద్యుత్ కోత. కరెంట్ పోవడంతో మైక్ ఆగిపోయింది. రెండు నిమిషాల తర్వాత జనరేటర్ ఆన్ చేశారు.
అప్పుడు లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి ముఖ్యమంత్రి (కల్వకుంట్ల చంద్రశేఖర రావు) సరిగా విద్యుత్ ఇవ్వడం లేదన్నారు. విద్యుత్ కోత ఎలా ఉందో చూడాలని ఎద్దేవా చేశారు.
లోకేశ్కు త్వరలో పార్టీలో కీలక బాధ్యతలు!
లోకేశ్కు త్వరలో పార్టీలో కీలక బాధ్యతలు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. బుధవారం ప్రారంభమైన మహానాడులో ఈ దిశగా స్పష్టమైన సంకేతాలు కనిపించాయి. లోకేశ్ ప్రస్తుతం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా ఉన్నారు.
తొలిరోజు పార్టీ అధ్యక్షుని ప్రసంగం తర్వాత తొలి చర్చ సంక్షేమ నిధి కార్యక్రమాలపైనే జరిగింది. ఈ సందర్భంగా ఏడాదిలో తాము చేసిన వివిధ కార్యక్రమాలను లోకేశ్ వివరించారు. ఆ తర్వాత మాట్లాడిన పార్టీ సీనియర్ నేతలు కళా వెంకట్రావు, పెద్దిరెడ్డి ఈసారి పార్టీ సభ్యత్వం అరకోటికి చేరుకోవడంలో లోకేశ్ పాత్రను ప్రశంసించారు.
లోకేశ్ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తేవాలంటూ మహానాడు వేదికపై నుంచే రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన రావు పార్టీ అధ్యక్షునికి విజ్ఞప్తి చేశారు.
పార్టీ అధ్యక్షునిగా, సీఎంగా మీపై ఎన్నో బాధ్యతలున్నాయని, మీరు కొత్త రాజధానిని నిర్మించాల్సి ఉందని, మీకు సమయం సరిపోవడం లేదని, పార్టీకి సంబంధించి కొన్ని బాధ్యతలను మీరు లోకేశ్కు అప్పగిస్తే బాగుంటుందన్నారు.
చంద్రబాబు పాదయాత్ర సమయంలో లోకేశ్ కృషిని, ఇటీవలి ఎన్నికల్లో పోటీ చేయాలని కోరితే లోకేశ్ తిరస్కరించడాన్ని గుర్తు చేశారు. గరికపాటి విజ్ఞప్తిపై బాబు ఏ స్పందనా వ్యక్తం చేయలేదు.
కానీ, ఈసారి పార్టీ సభ్యత్వాన్ని బాగా చేయడంపై మాత్రం పార్టీ నేతలందరినీ మెచ్చుకొన్నారు. లోకేశ్ కృషికి ప్రశంసలు లభించడం ఆయన పాత్ర పెరగబోతోందన్న దానికి సూచిక అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. త్వరలో పార్టీ నియామకాల్లో ప్రధాన కార్యదర్శుల్లో ఒకరుగా ఆయనను నియమించే అవకాశం లేకపోలేదంటున్నారు.