పురంధేశ్వరి వ్యాఖ్యలు: చంద్రబాబు పైనేనా?
చిత్తూరు: మాజీ కేంద్ర మంత్రి, స్వర్దీయ ఎన్టీ రామరావు కూతురు దగ్గుబాటి పురుంధేశ్వరి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. చంద్రబాబును ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేశారనే ప్రచారం సాగుతోంది. సంకల్పం మంచిది కాకపోవడమే రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిస్థితులకు కారణమని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. అయితే ఆమె ఎక్కడా చంద్రబాబు పేరు ప్రస్తావించలేదు.
రాష్ట్ర దేవాదాయశాఖమంత్రి పి. మాణిక్యాలరావు అధ్యక్షతన ఏర్పాటైన కరువు పరిశీలన బృందం చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె కూడలికి సోమవారం సాయంత్రం చేరుకుంది. అక్కడ తొలుత జనసమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించిన పురందేశ్వరి ఆ తర్వాత విమర్శల జడివాన కురిపించారు..
రాజు మంచివాడైతేనే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని ఆమె అన్నారు. అసలు రాజు బుద్దే మంచిది కాకుంటే పరిస్థితులు ఇలానే ఉంటాయని ఎద్దేవా చేశారు. చేపట్టిన సంకల్పం మంచిదైతే అంతా మంచే జరుగుతుందని కూడా అన్నారు.
రాష్ట్రం నుంచి కేంద్రానికి సరైన పద్ధతిలో వినతులు వెళితే వాటి పరిష్కారానికి కేంద్రం మొగ్గుచూపుతుందన్నారు. పాలకుడి దుర్బుద్దే ప్రస్తుతం దుర్భరమైన కరువు పరిస్థితులు నెలకొనడానికి కారణమంటూ పరోక్షంగా విమర్శించారు. కేంద్రం బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొండిచేయి చూపించిందని చంద్రబాబు విమర్శించిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ కూడా కేంద్రంపై తీవ్రంగా మండిపడుతోంది. ఈ స్థితిలో పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.