బాబుకు కృష్ణయ్య దూరం: బీసీల పార్టీ పెడ్తారా?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికైన ఆర్. కృష్ణయ్య ఆ పార్టీకి దూరమైనట్లే. పార్టీ కార్యకలాపాల్లో ఆయన ఎక్కడా పాల్గొనడం లేదు. పైగా, తాను పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనబోనని చంద్రబాబుతో చెప్పినట్లు ఆయన ఓ టీవీ చానెల్ కార్యక్రమంలో చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
అయితే, తాను తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగానే కొనసాగుతాను గానీ పార్టీకి దూరంగా ఉంటాననే పద్ధతిలో ఆయన వ్యవహరిస్తున్నారు. అయితే, ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో చేరేందుకు కూడా సుముఖంగా లేరు. కెసిఆర్ పాలన నవాబులు, రాజుల పాలన మాదిరిగా ఉందంటూ ఆయన తప్పు పడుతున్నారు.
అదే సమయంలో బీసీల కోసం పార్టీ పెట్టే ఆలోచన ఉన్నట్లు మాత్రం ఆయన చూచాయగా చెప్పారు. పార్టీ పెట్టాలని తనపై తీవ్రమైన ఒత్తిడి వస్తోందని, పరిస్థితులు అందుకు అనుకూలిస్తే పార్టీ పెడతానని ఆయన చెప్పారు. మొదటి నుంచీ బీసిల తరఫున పోరాటం చేస్తూ వస్తున్న కృష్ణయ్యకు గత శాసనసభ ఎన్నికల్లో చంద్రబాబు పిలిచి మరీ సీటు ఇచ్చారు. పార్టీ వేదికల మీద ఆయనకు చంద్రబాబు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. కానీ విజయం సాధించిన తర్వాత క్రమంగా ఆయన ప్రభ తగ్గుతూ వచ్చింది.
తెలుగుదేశం పార్టీలోని ఇతర తెలంగాణ నాయకులు కృష్ణయ్యను కలుపుకుని వెళ్లడానికి కూడా పెద్దగా ఆసక్తి కనబరుస్తున్నట్లు లేదు. ఆయన పార్టీ కార్యక్రమాలకు చాలా కాలం నుంచే దూరంగా ఉంటూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఆయన ఏమైనా రాజకీయ పార్టీ పెడతారా అనేది వేచి చూడాల్సిందే.