మోడీ మాటమార్చారని ఆరెస్సెస్ అనుబంధ సంస్థ ఫైర్
న్యూఢిల్లీ: బహుళ ఉత్పత్తుల చిల్లర వర్తకంలో 51 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐ) అనుమతించడం పైన యూపీఏ సర్కారు విధానాన్నే కొనసాగించాలనే నిర్ణయాన్ని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్) అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్ ఆక్షేపించింది.
ఎఫ్డీఐల విషయంలో బీజేపీ మాట మార్చిందని మండిపడింది. ఈ విషయమై స్వదేశీ జాగరణ్ మంచ్ ప్రధాని మోడీకి లేఖ రాసింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2012 సెప్టెంబరులో దీనికి వ్యతిరేకంగా భారత్ బంద్కు బీజేపీ కూడా మద్దతు పలికిందని, అధికారంలోకి రాగానే మాట మార్చిందని ఆరోపించింది.
ప్రభుత్వ నిర్ణయంతమకు బాధ కలిగిస్తోందని, దీనిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. స్వదేశీ జాగరణ్ మంచ్ కో కన్వీనర్ అశ్వనీ మహాజన్ శనివారం నాడు ఈ లేఖను ప్రధానికి రాశారు.
యూపీఏ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వం వీలైనంత త్వరగా ఉపసంహరిస్తుందని ప్రజలు ఆశించారన్నారు. కానీ పార్టీ వైఖరి ఎందుకు మారిందో అర్థం కావట్లేదన్నారు. ప్రజలు ఉంచిన నమ్మకాన్ని బీజేపీ వంచించిందని విమర్శించారు.
మోడీ ఏడాది పాలన పైన ఆరెస్సెస్ కూడా సంతృప్తి వ్యక్తం చేసింది. ప్రజల అభిమానాన్ని చూరగొనడంలో ఎన్డీయే సర్కారు సఫలీకృతమైందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆ సంస్థ అధికార పత్రిక ఆర్గనైజర్లో కథనం ప్రచురించింది.
మోడీ సర్కారుపై ప్రజల ఆకాంక్షలు భారీ స్థాయిలో ఉన్నాయని, అందుకే వారు ఈ ప్రభుత్వ పాలనను మొదటి ఏడాది నుంచే అంచనా వేయడం ప్రారంభించారని పేర్కొంది. అదే సమయంలో నిరవేర్చాల్సిన ప్రజల ఆకాంక్షలు భారీ స్థాయిలో ఉన్న విషయాన్ని మోడీ సర్కారు మర్చిపోకూడదని హెచ్చరించింది.