నడిచివెళ్తా, ఎవరినైనా ఆపగలరేమో నన్నుకాదు:మోడీ
పాట్నా: బీహార్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ప్రత్యర్థుల పైన సోమవారం తన వాగ్భాణాలు సంధించారు. బబువాలో ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. మోడీ మాట్లాడుతుండగా.. కొందరు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
దీంతో, ఆయన తనను ఇలా అడ్డుకుంటే ఊరుకునేది లేదని, నడిచి వెళ్లి మరీ ప్రచారం చేస్తానని చెప్పారు. గతంలో తన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని పలువురు ఈసీని కలిసి దెబ్బతిన్నారని ఎద్దేవా చేశారు.
ఈ ప్రాంతంలో తనకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోందని, భారీ సంఖ్యలో తన ప్రచార కార్యక్రమానికి తరలి వచ్చారని అందుకే తనను ముందుకు వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. దీని వెనుక ఏదో కుట్ర దాగి ఉందని భావిస్తున్నానని, ఈ విషయాన్ని ఈసీ పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
బీహార్లో నేను ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటే తమ ఓటమి ఖాయమని బడే భాయ్ (లాలూ ప్రసాద్ యాదవ్), చోటే భాయ్ (నితీశ్ కుమార్) హడలిపోతున్నారన్నారు. అందుకే తన సభలు జరగకుండా అడ్డుకోవాలనుకున్నారని ఆరోపించారు.
ఎన్నికల సంఘం నుంచి అనుమతి లభించడంతో చేసేదేమీ లేక తన సభల ప్రత్యక్ష ప్రసారాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించారన్నారు. బిహార్ను 25 ఏళ్లలో సర్వనాశనం చేసిన ఆ ఇద్దరినీ ఈ ఎన్నికల్లో ఇంటికి పంపించేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు.
ప్రజాస్వామ్యంలో మీరు (లాలూ, నితీశ్) ఎవరి గొంతునైనా నొక్కేయవచ్చు గానీ మోడీది మాత్రం కాదన్నారు. తన సభలపై మీరు నిషేధం విధిస్తే నేనొక శ్రామికుడిగా పాదయాత్ర చేస్తానన్నారు. అప్పుడు మీరు నన్నేమీ చేయలేరన్నారు.
సోమవారం బిహార్లో జెహానాబాద్, భభువాల్లో ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు. తన నియోజకవర్గమైన వారణాసికి అత్యంత చేరువగా బబువా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. వారణాసి నుంచి నేను పోటీ చేస్తున్నప్పుడు అక్కడ కనీసం ఒక సమావేశాన్ని నిర్వహించడానికైనా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించలేదని, ఏదో ఒక నెపంతో అనుమతి నిరాకరించేదన్నారు. నన్ను ఆపగలిగారు.. కానీ ప్రజలు నన్ను ఎన్నుకోకుండా వారేమైనా చేయగలిగారా? అన్నారు.
అలాంటి చర్యలు చేపట్టేటప్పుడు ప్రభుత్వాలు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలన్నారు. మోడీని మీరు ఆపవచ్చు, ఆపలేకపోవచ్చు కానీ, ప్రజా వెల్లువను మాత్రం మీరు ఎన్నటికీ నిలువరించలేరన్నారు.
బిహార్లో సీనియర్ మంత్రి అవధేశ్ ప్రసాద్ కుష్వాహా ముంబయికి చెందిన ఓ వ్యాపారి నుంచి లంచం స్వీకరిస్తూ శూలశోధనలో దొరికిపోయిన విషయాన్ని ప్రధాని మోడీ ప్రముఖంగా ప్రస్తావించారు. వారికి సిగ్గూశరం లేవనీ, అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన జయప్రకాశ్ నారాయణ్ను అవమానపరిచేలా వ్యవహరిస్తున్నారన్నారు.