టీ సీఎం కేసీఆర్ ఓ రైతు: ప్రదర్శనలో ఆయన పంట
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు మెదక్ జిల్లాలోని జగదేవ్పూర్ మండలం ఎర్రవెల్లిలో వ్యవవసాయ క్షేత్రం ఉన్న విషయం తెలిసిందే. ఇందులో ఆయన వివిద రకాల పంటలు పండిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉద్యాన ప్రదర్శన జరుగుతోంది.
ఈ ప్రదర్శనలో కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో పండిన పలు కూరగాయలు, పంటలు కూడా కొలువుదీరాయి. ఇందులో కీర దోసకాయ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కేసీఆర్ ఫాం హౌస్లో పండిన వాటిని ఉద్యాన ప్రదర్శనలో ఆయన పేరుతోనే ప్రదర్శించారు.
రైతు పేరు.. శ్రీ కే చంద్రశేఖర రావు అని, గ్రామం.. ఎర్రవెల్లి అని, మండలం.. జగదేవ్పూర్ అని, పంట పేరు.. యూరోపియన్ కుకుంబర్, రకము.. రిజ్వాన్ అని అందులో పేర్కొన్నారు. కేసీఆర్ యూరోపియన్ కుకుంబర్ను తన వ్యవసాయ క్షేత్రంలో ఆధునిక పరిజ్ఞానం ఉపయోగించి పండించారు.
కాగా, సార్వత్రిక ఎన్నికలకు ముందు కేసీఆర్.. విలేకరులను తన వ్యవసాయ క్షేత్రానికి పిలిపించి చూపిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తాను ఆధునిక పరిజ్ఞానంతో వ్యవసాయం ద్వారా లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నట్లు చెప్పారు.
అప్పుడు తెలుగుదేశం, కాంగ్రెస్ సహా పలువురు కేసీఆర్ పైన మండిపడ్డారు. మీరు పండించే ఆధునిక పద్ధతులు రాష్ట్రంలోని రైతులకు చెబితే, వారు కూడా లక్షలాది రూపాయలు ఆర్జిస్తారు కదా అని విమర్శలు గుప్పించారు. కాగా, ఇప్పుడు కూడా దీనిపై పలువురు సామాజిక అనుసంధాన వెబ్ సైట్లలో స్పందిస్తూ.. ఆ పద్ధతులు రైతులందరికీ చెబితే బాగుంటుంది కదా అంటున్నారు.