‘ఓం’ అన్నా వివాదమే అవుతోంది: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశంలో ‘ఓం' అని ఉచ్చరించినా వివాదంగా మారుతోందని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఆకాశవాణి రూపొందించిన ‘రామ్చరిత్ మానస్' డిజిటల్ ప్రతుల(సీడీ)ను సోమవారం ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎంఎస్ సుబ్బులక్ష్మి ఆలపించిన ‘శ్రీవేంకటేశ్వర సుప్రభాతం' దక్షిణాదిన ఎంత ప్రజాదరణ పొందిందో.. ఉత్తర భారతంలో రేడియోలో ప్రసారమయ్యే ‘రామ్చరిత్ మానస్'కూ అంతే ఆదరణ ఉందని చెప్పారు.
‘దేశం ఎన్నో ఎత్తుపల్లాలు చూసింది. సైద్ధాంతిక ప్రాతిపదికనా ఇవి కనిపించాయి. ఈ రోజుల్లో ఎవరైనా 'ఓం' అన్నా అలా ఉచ్ఛరించడమేమిటంటూ వారం పాటు వివాదం రేకెత్తించినా ఆశ్చర్యపోనవసరం లేదు...' అని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. దీనిపై మరింత వివరాల్లోకి ఆయన వెళ్లకపోయినా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఓం ఉచ్ఛారణపై రేగిన వివాదాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాఖ్య చేసినట్లు భావిస్తున్నారు.
'...ఇలాంటి దేశంలో ఇప్పటివరకు రామచరిత మానస్ను ఎవరూ ప్రశ్నించలేదు. ఇది ఇప్పటికీ అప్రతిహతంగా కొనసాగుతోంది. ఇప్పుడెవరైనా దీనిపై దృష్టినిలిపి, వివాదాన్ని సృష్టించవచ్చేమో... నాకు తెలియదు' అని ప్రధాని అన్నారు.
గోస్వామి తులసీదాస్ రచించిన రామచరిత మానస్ చాలా గొప్ప ఇతిహాసమనీ, భారతీయ జీవన సారాంశానికి అది ప్రతీక అని పేర్కొన్నారు. భారతీయ నాగరికతకు మన సంస్కృతిలోని కుటుంబ విలువలే కారణమనీ, ఈ విలువల్ని ప్రపంచమంతా కొనియాడుతోందని మోడీ చెప్పారు. రామచరిత మానస్ కూడా కుటుంబ విలువల్ని ప్రబోధిస్తూ ఈ విషయంలో పెద్దపాత్ర పోషించిందన్నారు.
ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన ఆకాశవాణిపైనా మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. ఆ సంస్థవద్ద పలువురు ప్రముఖ కళాకారులకు చెందిన 9లక్షల గంటల ఆడియో రికార్డింగ్లు ఉన్నాయని.. అది అమూల్యమైన కలెక్షన్ అని, వాటిని శాశ్వతంగా భద్రపరచాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.