వెంకయ్య నాయుడు వారికి పెద్దన్నయ్య
న్యూఢిల్లీ: జాతీయ రాజకీయాల్లో కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడి పాత్ర నానాటికీ పెరుగుతోంది. రాజ్యాంగం పట్ల నిబద్ధతపై జరిగిన పార్లమెంటు సమావేశాల నిర్వహణలో ఆయన తీసుకున్న శ్రద్ధ అందుకు నిదర్శనం. ఆయనకు ఈ సమావేశాలు ప్రత్యేక గుర్తింపును సంతరించి పెట్టాయి.
అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులను స్వయంగా కలుసుకుని చర్చలో పాల్గొనే విధంగా చేయడంలో పెద్దన్నయ్యను తలపించిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అందుకే అరుణ్ జైట్లీ, ధావర్ చంద్ గెహ్లాట్తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బిజెపి ఎంపీలు వెంకయ్యనాయుడిని పెద్దన్నయ్యగా పిలుస్తున్నారు.
రాజ్యాంగంపై చర్చలో పాల్గొనే సమయంలో ప్రతిపక్షాలపై, ముఖ్యంగా కాంగ్రెసుపై విమర్శలు చేయకూడదని ముందుగానే ఆయన బిజెపి, ఎన్డీఎ భాగస్వామ్య పక్షాల సభ్యులను హెచ్చరించారు. ప్రస్తుత వివాదాంశాలు చర్చలోకి రాకుండా జాగ్రత్త పడ్డారు.
శీతాకాలం పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగడానికి జిఎస్టి వంటి కీలక బిల్లులు ఆమోదం పొందడానికి ఆయన జైట్లీతో కలిసి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీలతో భేటీని కూడా ఏర్పాటు చేశారు. మొత్తం మీద వెంకయ్యనాయుడు వారెవ్వా అనిపించుకుంటున్నారు.