అమ్మగారికి నమ్మకాలు: శనివారమే ఎందుకు?
చెన్నై: తమిళ ప్రజలు విపరీతంగా ఆరాధించే అమ్మ జయలలితకు విశ్వాసాలు ఎక్కువే. ఆ విశ్వాసం కారణంగానే ఆమె తన పేరును ఇంగ్లీషులో రాసే విషయంలో చివరలో అదనంగా ఓ అక్షరం చేర్పించుకున్నారు. తాజాగా, ఆమె నమ్మకాలకు సంబంధించి మరో కోణం కూడా బయటపడింది. శనివారంనాడు ఆమె తమిళనాడు ముఖ్యమంత్రిగా ఐదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె శనివారాన్ని కావాలని ప్రమాణ స్వీకారానికి ఎంచుకున్నట్లు చెబుతున్నారు.
శనివారం స్థిరత్వాన్ని ఇస్తుందని నమ్మకం. ఆమె కోర్టు కేసుల్లో ఇరుక్కున్న పలుమార్లు ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. ఒక్కసారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది, మారోసారి ఆస్తుల కేసులో దోషిగా తేలడం వల్ల ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక ముందు అటువంటి అపశకునాలు రాకుండా స్థిరత్వంతో ముఖ్యమంత్రిగా పాలన సాగించే ఉద్దేశంతోనే ఆమె శనివారంనాడు ప్రమాణ స్వీకారం చేసినట్లు చెబుతున్నారు.
ప్రధానమైన కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రతిసారీ ఆమె ముహూర్తం చూసుకుని బయలుదేరుతారు. కొన్ని నెలల పాటు ఎవరికీ కనిపించకుండా ఉండిపోయిన జయలలిత శుక్రవారం మధ్యాహ్నం 1.28 గంటలకు అభిమానులకు దర్శనమిస్తారని భావించారు. కానీ ఆ సమయానికే ఆమె బయటకు వచ్చి శాసనసభ్యులను కలిశారు. తర్వాత గవర్నర్ను కలవడానికి వెళ్లారు.
అదే విధంగా శనివారం ఉదయం 10. గంటల 37 నిమిషాలకు ఆమె చెన్నైలోని పోయెస్ గార్డెన్ నుంచి బయలుదేరారు. నిజానికి, పోయెస్ గార్డెన్ ఆమె ప్రమాణ స్వీకారం చేయడానికి ఎంచుకు వేదికకు కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆమె ఇంటి పక్కనే ఉండే సూపర్ స్టార్ రజనీకాంత్ ఆమె కన్నా ముందే వేదిక వద్దకు చేరుకున్నారు.
ఆకుపచ్చ రంగు చీర ధరించిన జయలలిత సరిగ్గా 11 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమమంతా అర గంటలో ముగిసింది. మంత్రులతో సామూహికంగా ప్రమాణ స్వీకారం చేయించారు. పాతవారినే తిరిగి మంత్రివర్గంలో చేర్చుకున్నారు. అన్నాడియంకె నేతలు, కార్యకర్తలు తెల్ల చొక్కాలు ధరించారు.