రాలేను: ప్రధాని మోడీకి సుప్రీం చీఫ్ జస్టిస్ ఝలక్
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు ప్రధాని నరేంద్ర మోడీకి షాకిచ్చారు! జాతీయ న్యాయ నియామకాల కమిషన్(ఎన్జేఏసీ)కు ఇద్దరు ప్రముఖులను ఎంపిక చేసే త్రిసభ్య కమిటీలో భాగస్వామిగా ఉండేందుకు జస్టిస్ హెచ్ఎల్ దత్తు నిరాకరించారు. ఈ మేరకు నేరుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఆయన లేఖ రాశారు.
తాజా పరిణామంతో న్యాయమూర్తుల బదిలీలు, పదోన్నతులను నిర్ణయించే కొత్త వ్యవస్థ ఎన్జేఏసీ సంక్షోభంలో పడింది. మూడు దశాబ్దాల కొలీజియం వ్యవస్థకు ఎన్డీయే ప్రభుత్వం ఇటీవలే చరమగీతం పాడింది. దాని స్థానంలో ఎన్జేఏసీ చట్టం అమలుకు ఇటీవలే పార్లమెంటు ఆమోదముద్ర వేసింది.
దాని ప్రకారం, కొలీజియం స్థానంలో న్యాయ నియామకాలన్నిటినీ ఆరుగురు సభ్యుల కమిటీ చేపడుతుంది. ఈ కమిటీలో ఇద్దరు ప్రముఖులను ప్రధాన మంత్రి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోకసభలో ప్రతిపక్ష నేత కలిసి ఎంపిక చేస్తారు.
ఈ నేపథ్యంలో ఇద్దరు ప్రముఖుల ఎంపికకు సమావేశానికి రావాలని ప్రభుత్వం సుప్రీం చీఫ్ జస్టిస్కు లేఖ రాసింది. ఇదిలా ఉండగా, ఎన్జేఏసీ చట్టం అమలును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటి విచారణను జస్టిస్ జేఎస్ ఖేహార్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ప్రారంభించింది.
ఈ నేపథ్యంలో చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు ప్రధాని మోడీకి శనివారం లేఖ రాసిన విషయాన్ని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దత్తు లేఖతో సుప్రీం కోర్టు, హైకోర్టుల్లో న్యాయ నియామకాలు గందరగోళంలో పడ్డాయని, ఆ సమావేశాలకు చీఫ్ జస్టిస్ హాజరు కావాలంటూ రాజ్యాంగ ధర్మాసనం ఆయనకు సూచించాలని కోరారు.