డీన్ పదవి కోసం నగ్నపూజలు: ఓ ప్రొఫెసర్ నిర్వాకం
చెన్నై: మెడికల్ కాలేజీలో డీన్ పదోన్నతి కోసం ఇంటిలో నగ్న పూజలు నిర్వహించడమే కాదు భార్యను కూడా నగ్నంగా పూజలో పాల్గొనాలంటూ వేధించిన ఓ ప్రొఫెసర్ వింత వైఖరి వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే ధర్మపురి ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రొఫెసర్గా పని చేస్తున్న సెల్వరాజ్ మొదటి భార్య మరణించడంతో సేలం జిల్లా కడయాంబట్టికి చెందిన కార్తీక అనే వితంతువును రెండో పెళ్లి చేసుకున్నారు.
కొంతకాలం పాటు వీరిద్దరి సంసారం సజావుగానే సాగింది. ఆ తర్వాతే ఆమెకు తన భర్త నుంచి వింత పరిస్థితులు ఎదురయ్యాయి. దీనిపై కార్తీక మాట్లాడుతూ తమ వివాహానంతరం తరచూ పూజలు చేయాలని భర్త బయటికి వెళ్లి వస్తుండేవాడని మొదట్లో దీనిని తాను పెద్దగా పట్టించుకోలేదన్నారు.
ఓ రోజు రాత్రి సెల్వరాజ్ నగ్నంగా పద్మాసనం వేసుకుని కూర్చుని ఉండటాన్ని చూసి అయోమయానికి గురయ్యానన్నారు. ఇదేంటని అడిగితే కాలేజీ డీన్ పదోన్నతి కోసమే ఈ నగ్నపూజ చేస్తున్నానని చెప్పాడని, అయితే తన భర్త నిర్వాకాన్ని పెద్దగా పట్టించుకోలేదన్నారు.
ఉన్నట్టుండి ఓ రోజు ఒక్కడినే నగ్నపూజ చేయడం వల్ల బోరు కొడుతోందని, తనతోపాటు ఆమె కూడా నగ్నంగా పూజలో పాల్గొనాలని వేధించడం తనలో ఆందోళన కలిగించిందన్నారు. తాను ఇటువంటి పూజలు చేయడం సరికాదని అనేక సార్లు తెలిపినప్పటికీ అతను పట్టించుకోలేదన్నారు.
దీంతో తమ మధ్య తరచుగా తగాదాలు జరిగేవన్నారు. దాంతో తాను తరచూ పుట్టింటికి వెళ్లి వస్తుండేది. ఈ క్రమంలో ఇటీవలే ఆమెను పిలిచిన సెల్వరాజ్, తనతో సంసారం చేయాలంటే నగ్న పూజ చేయాల్సిందేనని, లేకుంటే విడాకులిస్తానని బెదిరించాడు. దీంతో ఆమె పుట్టింటి వారితో తిరిగొచ్చి భర్తకు నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది.
దాంతో ఆగ్రహించిన సెల్వరాజ్ ఆమెను గురువారం రాత్రి కుటుంబీకుల సమక్షంలోనే చితకబాదాడు. గాయపడిన కార్తీక చికిత్స కోసం ఓమలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. తన భర్త దిగంబర పూజ చేస్తున్న సమయంలో తీసిన ఫొటోలను ఆమె మీడియాకి విడుదల చేసింది.