జగన్ కోటలో చంద్రబాబు ఫెయిల్: కారణం ఇదీ...
కడప: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కోటాలో పాగా వేయడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి. జగన్ సొంత జిల్లా కడపలో మహానాడును ఘనంగా నిర్వహించాలని చంద్రబాబు ఆలోచించారట.
అయితే, ఆయన ఆలోచన ఆచరణలోకి రాలేదు. దీనికి కారణం వైయస్ జగన్ అనుకుంటే పొరపాటే. పార్టీలోని అంతర్గత కుమ్ములాటల కారణంగానే ఆయన వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు. కడప జిల్లాలో పది నియోజకవర్గాలుండగా తొమ్మిది నియోజకవర్గాలలో మాత్రమే మినీ మహానాడు కార్యక్రమాలు జరిగాయి. జమ్మలమడుగు నియోజకవర్గంలో మాత్రం మినీ మహానాడు జరగలేదు.
అక్కడ మినీ మహానాడును జరపడానికి తెలుగుదేశం పార్టీకే చెందిన రెండు వర్గాలు ప్రయత్నించాయి కానీ ఆ ప్రయత్నాలు ఎదురు తిరిగాయి. రెండు వర్గాల కార్యకర్తలు ఒకే సమావేశానికి హాజరైతే గొడవలు జరుగుతాయని ఇంటలిజెన్స్ ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చింది. దీంతో స్వయంగా చంద్రబాబే జమ్మలమడుగులో మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించవద్దని అక్కడి ఇరువర్గాల స్థానిక నేతలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
జమ్మలమడుగులో తెలుగుదేశం పార్టీలో చేరిన శాసనసభ్యుడదు ఆదినారాయణ రెడ్డికి, ప్రత్యర్థి రామసుబ్బారెడ్డికి చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా సయోధ్య కుదరడం లేదు. దాంతో జమ్మలమడుగులో మినీ మహానాడుకు కూడా బ్రేక్ పడింది. దాంతో కడపలో మహానాడును నిర్వహించాలనే ఆలోచనకు కూడా చంద్రబాబు స్వస్తిచెప్పినట్లు సమాచారం.