గ్రేటర్ ఎన్నికలు: పరువు దక్కించుకున్న జగన్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు చావు దెబ్బ తినడం చూసిన తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మంచి పనిచేశారనే మాట వినిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయన పరువు దక్కించుకున్నారని అంటున్నారు.
ముందే చేతలెత్తేశారనే వ్యంగ్యాస్త్రాలను జగన్ మొదట చవి చూసినప్పటికీ నవ్విన నాప చేనే పండదా అంటున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసి, ప్రచారంలో ఆర్భాటాలు చూపిన కాంగ్రెసు పార్టీకి రెండు స్తానాలు, టిడిపి - బిజెపి కూటమికి ఐదు స్థానాలు మాత్రమే వచ్చాయి.
జగన్ పోటీ చేసి ఉంటే ఆ మాత్రం స్తానాలు వచ్చేవి కావా అని టిడిపి, కాంగ్రెసు ఫలితాలను చూసిన తర్వాత వ్యాఖ్యానిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, చిచ్చరపిడుగు అనిపించుకున్న రేవంత్ రెడ్డితో పాటు పలువురు ప్రచారం చేశారు.
బిజెపికి చెందిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి ప్రచారం చేశారు. కాంగ్రెసు గురించి చెప్పనే అక్కర్లేదు. ఎంతగా గొంతులు చించుకున్నా, కాలికి బలపం కట్టుకుని తిరిగినా ఫలితం లేకుండా పోయిందనే మాట వినిపిస్తోంది. ఈ స్థితిలో జగన్ ఏ కష్టమూ లేకుండా చూసుకుని ఒడ్డున కూర్చుని చూడడం ద్వారా ప్రతిష్ట దక్కించుకున్నారని అంటున్నారు.