కుప్పకూలిన భవనం యజమాని మంత్రి మిత్రుడు?
కుప్పకూలిన నానక్రామ్ గుడా భవనం యజమాని సత్తుసింగ్ తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డికి మిత్రుడని సమాచారం. దీంతో మహేందర్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు.
హైదరాబాద్: హైదరాబాదులోని నానక్రామ్ గుడాలో కుప్పకూలిన భవనం యజమాని సత్తుసింగ్ తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి మిత్రుడని తెలుస్తోంది. వారిద్దరి మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తూ మీడియాలో సత్తుసింగ్ కుమారుడితో కలిసి ఉన్న ఫొటోలు అచ్చయ్యాయి. ఈ ఘటనతో మహేందర్ రెడ్డి చిక్కుల్లో పడినట్లేనని భావిస్తున్నారు.
అయితే, సత్తుసింగ్ ఎవరో తనకు తెలియదని, అతనితో తనకు ఏ విధమైన లావాదేవీలు లేవని మహేందర్ రెడ్డి అంటున్నారు. నానక్రామ్ గుడాలో నిర్మాణంలో ఉన్న భవనం కూలి 11 మంది మరణించిన విషయ తెలిసిందే. ఆ భవనం యజమాని సత్తుసింగ్ అలియాస్ సత్యనారాయణ సింగ్ మహేందర్ రెడ్డితో సంబంధాలు పెట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి.
సత్తుసింగ్ కుమారులు సాకేత్, అనిల్ సింగ్లు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో పనిచేస్తున్నారు. సాకేత్ సింగ్ 2016 ఎన్నికల్లో శేర్లింగంపల్లి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. తెరాస టికెట్ లభించకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
భవనం యజమాని జిహెచ్ఎంసి అధికారులను బెదిరిస్తూ వచ్చినట్లు కూడా చెబుతున్నారు. ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేస్తానని బెదిరిస్తూ వచ్చాడని, భవన నిర్మాణం ఐదు నెలలుగా కొనసాగుతోందని చెబుతున్నారు.