లోకేష్-ఎన్టీఆర్ 'గ్యారేజ్ వార్'! : వెనక్కి తగ్గిన టీడీపీ
విజయవాడ : అవతలి వ్యక్తి భవిష్యత్తులో తనకు పోటీ అవతాడన్న భావన్న ఉన్నప్పుడు.. ఆధిపత్యం చెలాయించడం కోసం అతని స్పీడ్ కు బ్రేకులు వేసే ప్రయత్నాలు జరుగడం రాజకీయాల్లో కామనే. జనాల్లో ఉన్న ఫాలోయింగ్ ను దెబ్బకొట్టడం ద్వారా ప్రత్యర్థి ఇమేజ్ ను తగ్గించే ప్రయత్నాలు తెర వెనుక జరుగుతుంటాయి.
నారా-నందమూరి కుటుంబాల నడుమ ప్రస్తుతం ఇదే ఆధిపత్య పంథా కొనసాగుతోందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దీనంతటికీ కేంద్రబిందువుగా మారిన అంశం మరో రోజులో విడుదల కాబోతున్న ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్'. సహజంగానే బెనిఫిట్ షో లకు అనుమతులు మంజూరు చేసే అధికారులు.. ఒక్క ఎన్టీఆర్ విషయంలో మాత్రం 'నో' చెప్పేసరికి అభిమానుల ఆగ్రహం తారా స్థాయికి చేరింది.
బెనిఫిట్ షోలకు జాయింట్ కలెక్టర్ అనుమతులు నిరాకరించిన నేపథ్యంలో.. ఏకంగా కలెక్టరేట్ల వద్ద ధర్నా చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు ఎన్టీఆర్ అభిమానులు. స్థానిక కృష్ణా జిల్లా మంత్రులను కూడా అభిమానులను నిలదీయడంతో.. ప్రభుత్వం కూడా దిగిరాక తప్పని పరిస్థితి. ఓ సినిమా విషయంలో ప్రభుత్వం అభాసుపాలు కావడం టీడీపీ ఇమేజ్ కు ఏమాత్రం మంచిది కాదని భావించిన సీఎం చంద్రబాబు.. వెంటనే కలెక్టర్ ఆదేశాలను ఉపసంహరించుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
తెర వెనుక హస్తం లోకేష్ దేనా..
మొత్తం వ్యవహారంలో.. ఎన్టీఆర్ సినిమాకు అడ్డు తగిలింది లోకేషే అన్న ప్రస్తావన ఎన్టీఆర్ అభిమానుల్లో బలంగా వినిపిస్తోంది. నందమూరి కుటుంబంలో.. ఒక్క జూనియర్ ఎన్టీఆర్ నుంచే లోకేష్ భవిష్యత్తు రాజకీయాలకు ప్రమాదం ఏర్పడవచ్చన్న అభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో.. ఉద్దేశపూర్వకంగానే ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ కు అడ్డు తగిలే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అబిమానుల ఆగ్రహంతో ప్రభుత్వం వెనుకడుగు వేయడం.. జనతా గ్యారేజ్ బెనిఫిట్ ఫో లకు అడ్డంకులు తొలగిపోవడం జరిగిపోయాయి. అయితే ఏ ఎన్టీఆర్ ఇమేజ్ ను అయితే లోకేష్ దెబ్బ తీయాలనుకుంటున్నారో.. అది జరగ్గపోగా, రివర్స్ లో లోకేష్ ఇమేజ్ కే దెబ్బ రావడం, ఎన్టీఆర్ కు లేని పొలిటికల్ మైలేజ్ ను క్రియేట్ చేయడం.. ఇలాంటి ఎత్తుగడల ద్వారా చిత్తయిపోవడం తప్ప వచ్చే లాభమేమి ఉండదని టీడీపీ నేతల్లోనే గుసగుసలు వినిపిస్తున్నట్లుగా తెలుస్తోంది.