రూ.1 మాత్రమే: జయపై డ్రైవర్ వినూత్న అభిమానం..
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పట్ల చాలామంది వివిధ రకాలుగా తమ అభిమాని చాటుకుంటుంటారు. నాయకులు, కొందరు కార్యకర్తలు అయితే ఏకంగా ఆమెకు పాదాభివందనం చేయడం, ఆమె వెళ్తుంటే వంగి వంగి నమస్కరించడం చేస్తుంటారు.
జయలలిత సోమవారం నాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రిగా మొత్తం ఆరోసారి, వరుసగా రెండోసారి ఆమె అధికారం చేపట్టి రికార్డు సృష్టించారు. నిన్న ఆమె ప్రమాణ స్వీకారం సందర్భంగా జయ అభిమాని అయిన ఓ ఆటో డ్రైవర్ తన ఆటోలో ఛార్జీని కేవలం ఒక్క రూపాయి మాత్రమే వసూలు చేశాడు.
కోయింబత్తూరుకు చెందిన సదరు ఆటో డ్రైవర్ సోమవారం నాడు ఒక్క రూపాయి ఛార్జీకే ప్రయాణికులకు సేవలు అందించాడు. అతని పేరు మాథివనమ్. అతని వయస్సు45. ఇరవై అయిదేళ్లుగా ఆటో నడుపుతున్నాడు. అన్నాడీఎం పార్టీని స్థాపించిన ఎంజీ రామచంద్రన్కి మాథివనమ్ వీరాభిమాని.
ఎంజీఆర్ పట్ల అభిమానాన్ని కొనసాగిస్తూనే జయలలిత అభిమానిగా మారాడు. అన్నాడీఎంకే పార్టీ గెలుపొందిన ప్రతీసారీ ఏదో విధంగా తన అభిమానాన్ని చాటుతుంటాడు. ఈసారి అన్నాడీఎంకే గెలుపొంది జయలలిత వరసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కొత్తగా ఆలోచించి ప్రయాణికులకు ఒక్క రూపాయికి సేవలు అందించాడు.
నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లినా ఒక్కో రూపాయికే ప్రయాణికులకు సేవలందించినట్లు ఆయన పేర్కొన్నారు. తన ఆటో పైన జయలలిత పోస్టర్లు అంటించి, ఒక్క రూపాయికే ఎక్కడినుంచి ఎక్కడికైనా సేవలందిస్తానని పేర్కొన్నాడు.