గెలిస్తే సంతోషమేది: చిర్రెత్తిన ధోని, బిగ్బీ ప్రశ్న
బెంగళూరు: భారత్ - బంగ్లా మ్యాచ్ అనంతరం భారత జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీకి కోపం వచ్చింది. అంతేకాదు, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కోపం రావడంపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ధోనీ ప్రెస్ మీట్ వీడియోను చూడాలి.
అలాగే సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో అమితాబ్ ఏమన్నారో చదవాల్సి ఉంటుంది. మ్యాచ్ అనంతరం ఎప్పుడూ జరిగే ప్రెస్ మీట్లో కెప్టెన్ ధోనీ మాట్లాడాడు. ఈ సందర్భంగా మీడియా నుంచి వచ్చిన ప్రశ్నకు ఆగ్రహోద్రుడయ్యాడు.
'నాకు అర్థమైంది. భారత్ గెలిచినందుకు మీరు సంతోషంగా లేరు. నేను చెప్పేది వినండి. మీ గొంతును, మీ ప్రశ్నను బట్టి చూస్తుంటే భారత్ గెలుపుపై మీరు సంతోషంగా లేనట్లుగా కనిపిస్తోంది. క్రికెట్ విషయానికి వస్తే ఇందులో స్క్రిప్ట్ అంటూ ఉండదు. మేం టాస్ ఓఢిపోతే వికెట్ ఎలా ఉంది, బ్యాటింగ్ అలా ఉండటానికి కారణాలేంటున్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. అలా తెలుసుకోకుండా అడగడం సరికాదు' అన్నాడు.
మరోవైపు, భారత కామెంటేటర్లుగా ఎప్పుడైనా కూడా అవతలి వాళ్ల కంటే మన వాళ్ల గురించి మాట్లాడాలని అమితాబ్ ట్వీట్ చేశారు. మ్యాచులో కామెంటేటర్లు బంగ్లా బ్యాట్సుమెన్ గురించి ఎక్కువగా ప్రస్తావించడం, చివరి ఓవర్లో పాండ్యా వరుసగా రెండు వికెట్లు తీసినా కూడా దాని గురించి పెద్దగా ప్రస్తావించకపోవడం అమితాబ్కు ఆగ్రహం తెప్పించింది.
ఎప్పుడు చూసినా వాళ్లనే పొగుడూతూ ఉంటారని, అవతలి జట్టులో బ్యాట్సుమెన్ అవుట్ అయినప్పుడు దానికి దుఃఖం వ్యక్తం చేస్తున్నారని, మన బౌలింగు గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడరేమిటని ట్విట్టర్లో ప్రశ్నించారు. మనవాళ్ల గురించి కూడా మాట్లాడాలని అభిప్రాయపడ్డారు.
కాగా, అమితాబ్ బచ్చన్ ట్వీట్కు 2,500 మంది రీట్వీట్ చేశారు. కూల్ కెప్టెన్ ధోనీ సాధారణంగా కాంట్రోవర్సీలకు దూరంగా ఉంటాడు. అందులో 'జోడించేందుకు ఏం లేదని' రీట్వీట్ చేశాడు. ధోనీ ట్వీట్ను 4500 మంది రీట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా కామెంటేటర్లుగా భారత్ తరఫున సునీల్ గవాస్కర్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, సంజయ్ మంజ్రేకర్, ఆకాష్ చోప్రా తదితరులు ఉన్నారు.