వెడ్డింగ్ కార్డుతో షాకిచ్చిన గాలి జనార్ధన్: ఆ డబ్బెక్కడిదో ఒక్కమాటలో..!
బెంగళూరు: కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి తన కూతురు పెళ్లిని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఆయన పెళ్లి పత్రికను చూసే చాలామందికి ఇది అర్థమైంది. ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా పెళ్లి పత్రికను ఓపెన్ చేయగానే 'ఆహ్వాన' వీడియో కనిపించిన విషయం తెలిసిందే.
చర్చనీయాంశమైన గాలి కూతురు వెడ్డింగ్ కార్డ్
ఇది రాజకీయ వర్గాల నుంచి సోషల్ మీడియా వరకు చర్చనీయాంశంగా మారింది. గాలి జనార్ధన్ రెడ్డి తన కూతురు బ్రాహ్మిణి పెళ్లి వెడ్డింగ్ కార్డుతోనే ఇంతలా షాకిస్తే.. పెళ్లికి మరెంత షాకిస్తారో, ఎంత ఖర్చు పెడతారోననే చర్చ జోరుగా సాగుతోంది.
సోషల్ మీడియాలో సెటైర్లు
ఇదిలా ఉండగా, గాలి వెడ్డింగ్ కార్డు పైన సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గాలి జనార్ధన్ రెడ్డి మైనింగ్ అక్రమాల కారణంగా పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించారు. ఆయన కొన్నేళ్ల పాటు జైలులో గడిపి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనను నెటిజన్లు టార్గెట్ చేసుకుంటున్నారు.
జాగ్వార్నీ వదల్లేదు
అందులో కొన్ని, మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి తనయుడు హీరోగా ఇటీవల జాగ్వార్ సినిమా విడుదలైన విషయం తెలిసిందే. 'కుమారన్నా, మీ కొడుకు జాగ్వార్ సినిమా కూడా ఇంతలా హల్చల్ కాలేదని, నా కూతురు వెడ్డింగ్ కార్డు మాత్రం దుమ్మురేపుతోందని' అంటున్నట్లుగా ఫోటోలు పెట్టి నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.
ఇది 'మైన్' డబ్బు
నెటిజన్లు ఫోటోలు పెట్టి మరీ విమర్శలు చేస్తున్నారు. మరో నెటిజన్.. 'నాకు ఒక మాటలో జవాబు కావాలి. నీకు ఇంత డబ్బు ఎలా వచ్చింది. అలాగే ఇది ఎవరి డబ్బు' అని ఒకరు ప్రశ్నిస్తారు. దానికి గాలి జనార్ధన్ రెడ్డి ఫోటో పెట్టి.. 'మైన్' అని రెండు అర్థాలు (నా డబ్బు, మైనింగ్) వచ్చేలా సెటైర్ వేశారు.
ఐటీ ఏం చేస్తుందని ప్రశ్ని
కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కూతురు పెళ్లి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. గాలి కూతురు పెళ్లి విషయమై సిపిఐ నేత రామకృష్ణ కూడా రెండు రోజుల క్రితం స్పందించారు. ఆయన తన కూతురు పెళ్లి ఇలా చేస్తుంటే ఐటీ (ఆదాయపన్ను శాఖ) ఏం చేస్తోందని ప్రశ్నించారు.
పదకొండు రోజుల పెళ్లి
తన కూతురు పెళ్లి వేడుకలను గాలి జనార్ధన్ రెడ్డి పదకొండు రోజుల పాటు జరపనున్నారు. ఈ పెళ్లికి టాలీవుడ్, శాండల్వుడ్, బాలీవుడ్, కోలీవుడ్ నటులు హాజరవుతున్నారని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, దేశ విదేశాల నుంచి అతిథులు రానున్నారు.
ఘనంగా పెళ్లి
మాజీ మంత్రి, మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన్ రెడ్డిపై కూతురు పెళ్లిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. కూతురు పెళ్లి శుభలేఖను ఎల్ఈడీ స్క్రీన్ తో రూపొందించి సంచలనం సృష్టించిన గాలి.. ఇప్పుడు పెళ్లి కూడా అంత ఘనంగా జరిపే ఏర్పాట్లలో ఉన్నారు. తన కూతురు 11 పెళ్లిరోజుల వేడుకలకు భారీగా ఖర్చు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఎవరు కనీవినీ ఎరుగుని రీతిలో గాలి జనార్ధన్ రెడ్డి తన కూతురు పెళ్లికి రూ. 550కోట్లకు పైగా ఖర్చు చేయనున్నట్లు తెలిసింది.