వారికి అమిత్ షా హామీ: అందుకే శశికళ ఔట్?
అమిత్ షా ఆశీస్సులతోనే అన్నాడియంకెలోని రెండు గ్రూపులు శశికళను దిక్కు లేకుండా చేసి ఒక్కటైనట్లు ప్రచారం సాగుతోంది.
చెన్నై: తమిళ రాజకీయాల్లో బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా కీలక పాత్ర పోషించినట్లు వార్తలు వస్తున్నాయి. శశికళను, ఆమె కుటుంబ సభ్యులను రాజకీయాలకు దూరం చేయడంలో ఆయన హస్తవాసి చూపించారని అంటున్నారు.
అన్నాడియంకెలోని ఇరు వర్గాలను ఒక్కటి చేయడంలో ఆయనదే ప్రధాన పాత్ర అంటున్నారు. ముఖ్యమంత్రి పళనిస్వామి, చీలిక వర్గం నేత పన్నీర్ సెల్వం చేతిలో చేయి వేసుకుని నడవాలనే నిర్ణయానికి అమిత్ షా కారణంగానే వచ్చారని అంటున్నారు.
పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పీఠంపై కన్ను వేయకపోవడానికి కూడా అదే కారణమని అంటున్నారు. తనను దెబ్బ తీసిన శశికళకు గుణపాఠం చెప్పాలనే తప్ప పన్నీరు పదవిపై ఆశపెట్టుకోలేదని అంటున్నారు. పళనిస్వామికి కూడా కావాల్సింది కూడా అదే కాబట్టి ఇరు వర్గాల మధ్య రాజీ కుదిరిందనే మాట వినిపిస్తోంది.
మా ఉద్దేశం ఇప్పటికి అర్థమై ఉంటుంది..
రెండు వర్గాలు కూడా కలిసిపోయి హాయిగా ఉండాలని, తమ ఉద్దేశం ఇప్పటికి అర్థమై ఉంటుందని అమిత్ షా అన్నట్లు సమాచారం. పన్నీరు సెల్వం, పళనిస్వామి వర్గాలకు చెందిన నేతలతో ఆయన ఆ మాట అన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అన్నాడీఎంకే గుర్తు రెండాకులు కూడా మీకే వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
ఆ అనుమానాలను నిజం చేస్తూ...
జాతీయ స్థాయిలో బిజెపి కనుసన్నల్లోనే తమిళనాడు రాజకీయాల్లో పరిణామాలను చోటు చేసుకుంటున్నాయనే అనుమానాలను నిజం చేస్తూ పళనిస్వామి వర్గానికి చెందిన నేత, లోక్సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, సెల్వం వర్గానికి చెందిన రాజ్యసభ సభ్యుడు మైత్రేయన్ మంగళవారం ఢిల్లీలో అమిత షాతో విడివిడిగా సమావేశమయ్యారు.
వారి పేరు కూడా ఎత్తలేదని..
శశికళ, దినకరన్ పేరు కూడా ఎత్తకుండానే అమిత్ షా వారి వద్ద ఆ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇద్దరూ కలిసి వస్తే భవిష్యత్తులో కలిసి పని చేసేందుకు కూడా తమకు కూడా అభ్యంతరం ఉండదని చెప్పినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఓ మంత్రి పదవి, రెండు సహాయ మంత్రి పదవులు కూడా ఇస్తామని షా వారికి హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు.
తమకు సగం సీట్లు ఇవ్వాలని...
రాష్ట్రపతి ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని, 2019 లోక్సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే-బీజేపీ చెరి సగం స్థానాల్లో పోటీ చేయాలని, అందుకు సరేనంటే తాము అన్నాడీఎంకే ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తామని అమిత్ షా స్పష్టం చేసినట్లు సమాచారం.
తమిళ సంక్షోభం ముగిసినట్లే...
తమిళ రాజకీయాలను తాము అనుకున్న స్థితికి తెచ్చామనే సంతృప్తి బిజెపి జాతీయ నాయకులకు ఉన్నట్లు తెలుస్తోంది. జయలలిత మరణించినప్పటి నుంచి తమిళ రాజకీయాల్లో రహస్యంగా జోక్యం చేసుకుంటూ వస్తున్న బిజెపి చివరకు అనుకున్నది సాధించినట్లు చెబుతున్నారు. తమను వ్యతిరేకిస్తున్న శశికళను రాజకీయాల నుంచి దూరం చేయడడమే పనిగా ఆ పార్టీ పనిచేసిందని చెబుతున్నారు. ఇదే సమయంలో - బీజేపీలో చేరేందుకు తమిళనాడులో చాలామంది తమతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆ పార్టీ తమిళనాడు ఇన్చార్జి మురళీధర్ రావు అన్నారు.