చంద్రబాబుకు షాక్: లంచం ఇస్తేనే పనులు చర్యలకు బాబు ఆదేశం
లంచం ఇస్తేనే పని చేస్తామని రెవిన్యూ అధికారులు చెబుతున్నారని పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం గ్రామానికి చెందిన అబ్బూరి లక్ష్మి అనే మహిళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఫిర్యాదు చే
ఏలూరు: లంచం ఇస్తేనే పని చేస్తామని రెవిన్యూ అధికారులు చెబుతున్నారని పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం గ్రామానికి చెందిన అబ్బూరి లక్ష్మి అనే మహిళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఫిర్యాదు చేసింది. ఈ విషయమై చంద్రబాబునాయుడు రెవిన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే లక్ష్మిని లంచం అడిగిన రెవిన్యూ అధికారులపై 24 గంటల్లోపుగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరంలో శనివారం నాడు పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. డిజిటల్ అక్షరాస్యత భవనాన్ని ప్రారంభించారు.
మీ గ్రామానికి అన్ని చేశాం,. సంతృప్తిగా ఉన్నారా అంటూ ఆయన గ్రామస్థులను ప్రశ్నించారు.అయితే ఈ విషయమై కొందరు గ్రామస్తులు అధికారులపై ఫిర్యాదు చేశారు.లంచం ఇవ్వనిదే పనులు చేయడం లేదని గ్రామస్థులు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు.
పట్టాదారు పాస్ పుస్తకం కోసం తన భర్తపేరున మార్చేందుకు వీఆర్ఓ ఫణిబాబు లంచం అడుగుతున్నాడని అబ్బూరి లక్ష్మి ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. తన మామ చనిపోయారని, ఆయన పేరున ఉన్న 70 సెంట్ల భూమిని తన భర్త పేరున మార్పిడి చేయాలని కోరితే రూ.30 వేలు లంచం అడుగుతున్నారని ఆమె ఫిర్యాదు చేసింది.
దీంతో 24 గంటల్లోపుగా రెవిన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. శ్యామల అనే వృద్దురాలు తనకు పెన్షన్ రావడం లేదని చెప్పారు.అయితే ఇంట్లో ఇతరులకు పెన్షన్ వస్తోందనే కారణంతో పెన్షన్ రావడం లేదేమోనని చంద్రబాబు చెప్పారు.అయితే తమ ఇంట్లో ఎవరికీ కూడ పెన్షన్ రావడం లేదన్నారు.
ఈ సమస్యను పరిష్కరించాలని సిఎం చెప్పారు.తనకు ఇల్లు మంజూరు చేయాలని ఓ వ్యక్తి ముఖ్యమంత్రిని కోరారు. వెంటనే ఈ విషయాన్ని పరిష్కరిస్తానని సిఎం హామీ ఇచ్చారు.
అభివృద్ది కోసం రైతులు తమ భూములను ఇవ్వాల్సిందేనని చంద్రబాబునాయుడు చెప్పారు. చేపల, రొయ్యల పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు సిఎం. ఈ పరిశ్రమల ఏర్పాటును అడ్డుకోకూడదని సిఎం చెప్పారు.