యుపి ఫలితాలు: డిగ్జీని టార్గెట్ చేసిన తెలుగు నేతలు
యుపి ఎన్నికల ఫలితాలు దిగ్విజయ్ సింగ్ పాలిట శాపంగా మారాయి. తెలంగాణ, ఎపి కాంగ్రెసు నాయకులు డిగ్గీపై నిప్పులు చెరుగుతున్నారు.
న్యూఢిల్లీ: కాంగ్రెసు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్పై రెండు తెలుగు రాష్ట్రాల పార్టీ నాయకులు నిప్పులు చెరుగుతున్నారు. దిగ్విజయ్ సింగ్ తమకు వద్దంటూ గగ్గోలు పెడుతున్నారు. యుపి ఎన్నికల ఫలితాలను, మణిపూర్, గోవా రాష్ట్రాల పరిణామాలు దిగ్విజయ్ సింగ్ పాలిట శాపంగా మారాయి.
తమ రాష్ట్రాల ఇన్చార్జి పదవి నుండి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ను తొలగించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులు, పార్లమెంటు సభ్యులు అధిష్ఠానాన్ని కోరారు. దిగ్విజయ్ సింగ్ వ్యవహరిస్తున్న తీరు, అవలంబిస్తున్న విధానాల కారణంగానే తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ముందుకు సాగడం లేదని, రోజురోజుకూ మరింతగా దిగజారిపోతోందని వారు అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రేణుకా చౌదరి, మర్రి శశిధర్ రెడ్డి ఇప్పటికే దిగ్విజయ్ తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా తెలంగాణకు చెందిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూడా అదే బాటలో నడుస్తున్నారు.
రాహుల్ గాంధీని కలిసి వినతి..
రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి, మరికొందరు సీనియర్ నాయకులు త్వరలోనే రాహుల్ గాంధీని కలిసి దిగ్విజయ్ సింగ్ను తొలగించాలని కోరుతూ ఒక వినతిపత్రాన్ని అందజేయనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు నాయకులు ఇటీవలి కాలంలో రాహుల్ గాంధీని కలిసినప్పుడు దిగ్విజయ్ సింగ్ వల్లనే తెలంగాణ, ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీకి కలుగుతున్న నష్టం గురించి వివరించినట్లు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు వేరు, వేరు నాయకులను ఇన్చార్జీలుగా నియమించాలని వారు అధినాయకత్వాన్ని కోరుతున్నారు.
రిపీట్ అవుతుందని భయం...
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ శాసన సభలకు 2019లో ఎన్నికలు జరిగే సమయానికి పార్టీని పటిష్టం చేయటంతోపాటు ప్రజల వద్దకు వెళ్లేందుకు ఇప్పటినుండే పెద్దఎత్తున కార్యక్రమాలు చేపట్టవలసి ఉన్నదని, ఇలా చేయని పక్షంలో ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పార్టీకి ఎదురైన ఫలితాలే ఇక్కడ కూడా ఎదురవుతాయని పార్టీ అధినాయకత్వాన్ని హెచ్చరిస్తున్నారు.
ఇలాగా అని డిగ్గీపై...
గోవా, మణిపూర్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకైక పెద్ద పార్టీగా ఎదిగివచ్చినా దిగ్విజయ్ సింగ్ వ్యవహరించిన విధానం, ముఖ్యంగా అవలంభించిన నిర్లక్ష్య వైఖరి ఫలితంగానే పార్టీ అక్కడ అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయిందని రెండు రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ బాగుపడి అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలంటే రాష్ట్ర ఇన్చార్జీలుగా కొత్తవారిని నియమించాలని వారు పార్టీ అధినాయకత్వాన్ని కోరుతున్నారు.
కిశోర్ చంద్రదేవ్ ఇలా...
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన చుట్టూ చేరిన డజను మంది నుంచి బయటపడాలని కేంద్ర గిరిజన వ్యవహారాలు, పంచాయతీరాజ్ శాఖల మాజీ మంత్రి కిశోర్ చంద్ర దేవ్ అన్నారు. బతికి బట్ట కట్టాలంటే ఇది అవసరమని తెలిపారు. ఈ డజను మంది ఆచరణలో ఎటువంటి జవాబుదారీతనం లేనివారేనని, వీరిపైనే పార్టీ ఆధారపడుతోందని అన్నారు. వీరిలో చాలా మంది పార్టీని పణంగా పెట్టి, తమకంటూ సొంత ఇష్టాయిష్టాలను ఏర్పరచుకున్నారని అన్నారు. వారు ముఖ్యమైన పదవుల్లో కొనసాగుతున్నారని చెప్పారు.
దిగ్విజయ్పై రేణుకా చౌదరి ఇలా....
గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు అనుసరించిన విధానం తెలివితక్కువ తనానికి నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. పార్టీ గోవా వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ మూర్ఖత్వం వల్లే ఇదంతా జరిగిందని ఆమె మండిపడ్డారు. తక్షణం ఆయనను పార్టీ గోవా ఇన్ చార్జి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
మర్రి శశిధర్ రెడ్డి కూడా ఇలాగే..
ఢిల్లీలో పాతుకపోయిన నేతలే... కిశోర్ చంద్రదేవ్ అభిప్రాయాన్నే తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెసు నేత మర్రి శశిధర్ రెడ్డి మరో రూపంలో వ్యక్తం చేశారు. ఢిల్లీలో పాతుకపోయిన నేతలను వారి వారి సొంత రాష్ట్రాలకు పంపించాలని ఆయన అన్నారు. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాల ఇంచార్జీలను కూడా మార్చేయాలని సూచించారు. దేశంలోకి కాంగ్రెసు బలోపేతానికి 1963 నాటి కామరాజ్ ప్లాన్ -2ను అమలు చేయాలని ఆయన సూచించారు. రాహుల్ గాంధీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేందుకు సిడబ్ల్యుసీ సభ్యులంతా రాజీనామా చేయాలని కూడా అన్నారు. పార్టీలో సమర్థులైన యువకులకు అవకాశం కల్పించాలని అన్నారు. మర్రి శశిధర్ రెడ్డి కూడా దిగ్విజయ్ సింగ్ను టార్గెట్ చేసినట్లు కనిపిస్తున్నారు.