సీఎం మీద కాకిరెట్ట: సిద్దరామయ్యను వెంటాడుతున్న కాకిగోల..
వేదిక సమీపంలో ఉన్న చెట్టు పైనుంచి ఓ కాకి సిద్దరామయ్య మీద రెట్ట వేసింది.
బెంగుళూరు: కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఈమధ్య కాలంలో ఎక్కువగా వివాదాలతోనే సహవాసం చేస్తున్న సంగతి తెలిసిందే. వజ్రాల వాచీ విషయంలో ఒకసారి.. కాకి కారెక్కి కూర్చున్నందుకు ఏకంగా కారునే మార్చేసి మరోసారి.. వివాదాల్లో ఇరుక్కున్నారాయన.
తాజాగా మరోసారి 'కాకి' గోలలో మునిగిపోయారు సీఎం సిద్దరామయ్య. కేరళలోని కాసరగోడు సమీపాన గల మంజేశ్వర్లో జరిగిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్బంలో.. వేదిక సమీపంలో ఉన్న చెట్టు పైనుంచి ఓ కాకి సిద్దరామయ్య మీద రెట్ట వేసింది.
కాకి రెట్ట వేయడంతో సిద్దరామయ్య ఇబ్బందిగా ఫీలయ్యారట. పక్కనే ఓ ఎమ్మెల్యే సిద్దరామయ్య ధోతిపై పడిన రెట్టను తుడిచేశారట. దీంతో భద్రతా సిబ్బంది ఆ కాకిని పనిగట్టుకుని మరీ తరిమినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, కాకి రెట్టవేయడం.. మంచి శకునమా? అపశకునమా? అని సీఎం సిద్దరామయ్య వేదిక పైనే సహచరులతో గుసగుసలాడారని చెప్పుకుంటున్నారు.
మొత్తానికి సీఎం సిద్దరామయ్య కాకిగోల ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్ గా మారింది. కాగా, ఇదే వేదిక మీద సిద్దరామయ్యతో పాటు లోక్సభ సభ్యుడు వీరప్ప మొయిలీ, మంత్రి రమానాథరై కూడా ఉన్నారు.