అయ్యన్న-గంటా.. ఆ 'సీన్' తో అంతా అర్థమైపోయింది.. అసలు సంగతి ఇదీ!
అప్పటికే విషయమంతా అర్థమైపోయాక.. ఇక ఎన్ని ప్రకటనలు చేస్తే మాత్రం ఏం లాభం.. మాటలకు చేతలకు ఎక్కడా పొంతన కుదరకపోవడంతో.. ఇద్దరి మధ్య విభేదాలు ఇంకా వేడి మీదనే ఉన్నాయన్న సంగతి అందరికి అర్థమైపోయింది.
విశాఖపట్నం: విశాఖ భూఆక్రమణల వ్యవహారం టీడీపీ సొంతగూటిలోనే పంచాయితీకి దారితీసి.. నేతల మధ్య విభేదాలను బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే. ఒకరు లేఖ రాయడం.. మరొకరేమో.. అబ్బే మా మధ్య విభేదాలేమి లేవు.. ఇద్దరి లక్ష్యం విశాఖను అభివృద్ది చేయడమే అంటూ మీడియా ముఖంగా వివరణ ఇచ్చుకున్నారు. కానీ వాస్తవం మాత్రం ఇందుకు భిన్నంగానే ఉంది.
పైకి విభేదాలేమి లేవని చెబుతున్నా.. అదంతా కప్పిపుచ్చుకునే చర్యగానే కనిపిస్తోంది. విశాఖ జర్నలిస్టుల ఫోరం(విజెఎఫ్) నిర్వహించిన ఓ అవార్డుల కార్యక్రమంలో ఈ విషయం తేట తెల్లమైంది. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి గంటా శ్రీనివాసరావు, మరో మంత్రి అయ్యన్నపాత్రుడు.. వేదిక మీద పక్కపక్కనే కూర్చున్నారు గానీ ఒకరి మొహం ఒకరు చూసుకున్న పాపాన పోలేదు.
మనుషులా? పశువులా?: భూదందాపై కడిగేసిన అయ్యన్న!, కంగు తిన్న మంత్రులు..
సభ జరిగినంతసేపే ఇదే తీరు. గంటా సెల్ ఫోన్ తో బిజీగా కనిపిస్తే.. అయ్యన్న దిక్కులు చూస్తూ కనిపించారు. నిజంగా ఏ భేషజాలు లేని మంత్రులైతే.. కనీసం మర్యాదకపూర్వకంగానైనా పలకరించుకుని ఉండేవారు కదా!. అటు జర్నలిస్టులు సైతం ఈ ఇద్దరి మంత్రుల వైఖరిని గమనిస్తూనే ఉన్నారు. కనీసం సభ ముగిసేవరకైనా ఇద్దరూ మాట్లాడకపోరా! అని ఎదురుచూసిన జర్నలిస్టులకు.. అలాంటిదేమి కనిపించలేదు.
పక్కపక్కనే కూర్చున్నా.. మనసులో తిష్ట వేసుకున్న విభేదాలు వారిద్దరిని తెగ ఇబ్బంది పెట్టినట్లు ఆ మొహాల్లోనే స్పష్టంగా కనిపించింది. ఇదంతా కవర్ చేయడానికా! అన్నట్లు మంత్రి అయ్యన్నపాత్రుడు మైక్ అందుకుని.. 'మేమేదో శత్రువలమైనట్లు.. మమ్మల్ని కలపడానికే జర్నలిస్టుల ఫోరం అన్నట్లు ఉందని' కామెంట్ చేశారు.
అప్పటికే విషయమంతా అర్థమైపోయాక.. ఇక ఎన్ని ప్రకటనలు చేస్తే మాత్రం ఏం లాభం.. మాటలకు చేతలకు ఎక్కడా పొంతన కుదరకపోవడంతో.. ఇద్దరి మధ్య విభేదాలు ఇంకా వేడి మీదనే ఉన్నాయన్న సంగతి అందరికి అర్థమైపోయింది. అదన్నమాట సంగతి.