సైలెంట్గా స్ట్రాటజీ అమలు చేసే పనిలో స్టాలిన్.. చక్రం తిప్పితే సంచలనమే!
అన్నాడీఎంకె నుంచి 20మంది ఎమ్మెల్యేలను తనవైపుకు తిప్పుకోగలిగితే స్టాలిన్ మరో సంచలనానికి తెరదీసనవారవుతారు.
చెన్నై: అన్నాడీఎంకె రాజకీయాలు ప్రతిపక్ష డీఎంకెకు కలిసొచ్చేలా తయారయ్యాయి. సీఎం కుర్చీ కోసం ఆపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ మధ్య రసవత్తర రాజకీయాలు సాగుతున్న తరుణంలో.. డీఎంకె నేత స్టాలిన్ సైలెంట్ గా తన పనికానిచ్చేస్తున్నారు.
ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవాలనే ప్రయత్నాల్లో పన్నీర్.. తన ఎమ్మెల్యేలను కాపాడుకోవాలనే ప్రయత్నంలో శశికళ ఉండగా.. ఇరు వర్గాల మీద అసంతృప్తితో ఉన్న నేతలను తనవైపుకు తిప్పుకోవాలనే యోచనలో ఉన్నారు స్టాలిన్. ఈ మేరకు సోమవారం నాడు స్టాలిన్ అధ్యక్షతన జరగనున్న డీఎంకె ఉన్నతస్థాయి సమావేశంలో దీనిపై చర్చించే అవకాశం ఉన్నట్టు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
కాగా, తమిళనాడు అసెంబ్లీలో ప్రస్తుతం డీఎంకెకు 89మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మిత్రపక్షాలను కలుపుకుంటే 98మంది సభ్యులు ఉన్నారు. అన్నాడీఎంకె నుంచి 20మంది ఎమ్మెల్యేలను తనవైపుకు తిప్పుకోగలిగితే స్టాలిన్ మరో సంచలనానికి తెరదీసనవారవుతారు. అన్నాడీఎంకెలో అటు పన్నీర్ ఇటు శశికళ నడుమ నలిగిపోతున్న ఎమ్మెల్యేలను తనవైపుకు తిప్పుకోవాలని స్టాలిన్ భావిస్తున్నట్టుగా సమాచారం.