జయలలిత మృతిలో ఊహించని ట్విస్ట్:ఆ 'జ్యూసే' ఆమె ప్రాణాలను హరించిందా?
నిజానికి జయలలిత చాలా కచ్చితమైన డైట్ పాటించాల్సి ఉండగా.. నర్సులు ఎవరు ఆమెకు డైట్ గురించి చెప్పలేదని, అందువల్లే ఆమె జ్యూస్ తాగారని ఆ కథనం ద్వారా ప్రచారమవుతోంది.
చెన్నై: నాటకీయ పరిణామాల నడుమ కన్నుమూసిన తమిళనాడు దివంగత సీఎం జయలలిత మృతికి సంబంధించిన చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. అపోలో వైద్యులు, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు జయలలిత మృతికి సంబంధించిన సందేహాలను నివృత్తి చేసినా.. అనుమానాలు మాత్రం ఇంకా చాలామంది మెదళ్లకు వేలాడుతూనే ఉన్నాయి.
ఇదే నేపథ్యంలో జయలలిత మృతికి సంబంధించి మరో ఆసక్తికర కథనం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అమ్మ మరణించడానికి కారణం ఆమె తాగిన ఫ్రూట్ జ్యూసే అన్నది ఆ కథనం సారాంశం. ఆసుపత్రిలో జయలలిత బాగా కోలుకున్న తర్వాత.. ఒకరోజు పండ్ల రసం తాగారని, దానివల్ల ఆమె గుండెపోటుకు గురయ్యారని ఆ కథనంలో పేర్కొన్నారు.
జయలలిత పండ్ల రసం తాగుతున్న సమయంలో నర్సులు, వైద్య సిబ్బంది ఎవరూ వారించలేదని, పండ్ల రసమే కదా! అని వారు తేలిగ్గా తీసుకున్నారని, చివరకు ఆ జ్యూసే జయలలిత ప్రాణాలకు ముప్పు తెచ్చిందని ఆ కథనంలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా మాద్యమాల్లో విపరీతంగా హల్ చల్ చేస్తోంది.
నిజానికి జయలలిత చాలా కచ్చితమైన డైట్ పాటించాల్సి ఉండగా.. నర్సులు ఎవరు ఆమెకు డైట్ గురించి చెప్పలేదని, అందువల్లే ఆమె జ్యూస్ తాగారని ఆ కథనం ద్వారా ప్రచారమవుతోంది. జయలలితకు ఫ్రూట్ జ్యూస్ ఇచ్చిన వ్యక్తి వివరాలు చెప్పేందుకు కూడా నర్సు నిరాకరించినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, జయలలిత మృతిపై సీబీఐ విచారణ జరిపించాలన్న డిమాండ్స్ చాలాకాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై పలువురు కోర్టు మెట్లెక్కగా.. ప్రతిపక్షం డీఎంకె సైతం సీబీఐ విచారణకు పట్టుబడింది. నిజాయితీకి కేరాఫ్ గా ఉన్న ఐఏఎస్ అధికారి సహాయం నేతృత్వంలో విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని ఐఆర్ఎస్ అధికారి బాలమురుగన్ తాజాగా మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
జయలలిత మృతికి సంబంధించి ఇప్పటికే ఇలాంటి పిటిషన్లు చాలావరకు దాఖలైన సంగతి తెలిసిందే. వీటన్నింటిని వచ్చే జూలై 4న విచారణకు స్వీకరించనున్నట్లు మద్రాసు హైకోర్టు తెలిపింది.