ఆశ్చర్యం: గాలి కూతురి పెళ్లి ఖర్చు ఇంతేనట
గాలి జనార్దన్ రెడ్డి తన కూతురు పెళ్లిని దిమ్మతిరిగే రీతిలో చేసిన విషయం తెలిసిందే. దానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఉంటారని అనుకున్నారు. కానీ తేల్చిందేమంటే....
బెంగళూరు: తన కూతురు బ్రాహ్మణి వివాహాన్ని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి గాలి జనార్దన్ రెడ్డి అంగరంగ వైభవంగా చేసిన విషయం తెలిసిందే. సామాన్యులకు దిమ్మతిరిగే రీతిలో ఆ పెళ్లి జరిగింది. దాంతో పెళ్లికి ఎక్కడ లేని వ్యయం అయి ఉంటుందని అనుకున్నారు. కానీ ఆయన తేల్చిన లెక్కలు చూస్తే ఆశ్చర్యం కలగకమానదు.
వివాహ ఆహ్వాన కార్డుతోనే సంచలనం సృష్టించిన గాలి జనార్దన్రెడ్డి కుమార్తె బ్రహ్మణి వివాహానికి కేవలం రూ.30 కోట్లే ఖర్చయ్యాయని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు ఆయన లెక్కలు చూపారు. గత నవంబరులో బెంగళూరులోని ప్యాలెస్లో అత్యంత అట్టహాసంగా బ్రహ్మణి వివాహం జరిగిన విషయం తెలిసిందే.
ఇందుకు రూ.400 కోట్లకుపైగా ఖర్చు పెట్టినట్లుగా వార్తలు వచ్చాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత కరెన్సీ దొరకక ప్రజలు ఓ వైపు తీవ్ర అవస్థలు పడుతుంటే గాలికి తన కుమార్తె పెళ్లికి అంతమొత్తంలో ఖర్చు పెట్టేందుకు డబ్బులెలా వచ్చాయో తెలియక దేశమంతా విస్తుపోయింది.
ఆ తర్వాత పెళ్లి కోసం పెద్దమొత్తంలో రద్దయిన నోట్లను అక్రమ పద్ధతుల్లో కొత్త నోట్ల రూపంలోకి మార్చుకున్నారని గాలిపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో పట్టుబడిన కర్ణాటక రెవెన్యూ అధికారి భీమానాయక్. గాలికి సంబంధించిన పెద్దనోట్లు మార్పిడిలో కీలక పాత్ర పోషించినట్లు తేలింది.
దాంతో పెళ్లి ఖర్చు వివరాలను సమగ్రంగా తెలపాలని ఐటీ శాఖ జనార్దన్రెడ్డికి సూచించింది. పెళ్లికి రూ.30 కోట్లు ఖర్చయిందని, తన భార్య అరుణాలక్ష్మి డైరెక్టర్గా ఉన్న ట్యూబుల్ రివేట్స్ నుంచి నిధుల సమకూర్చినట్లు ఆయన తెలియజేశారు. కొనుగోళ్లు డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా జరిపినట్లు తెలిపారు.